ఢిల్లీ మర్కజ్ నిజాముద్దీన్లో జరిగిన తబ్లీగి జమాత్ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరైన వందలాది మంది ప్రతినిధులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి దేశంలోని నలుమూలల నుంచి జమాత్ ప్రతినిధులు హాజరయ్యారు. అయితే మార్చి 13 నుంచి 18 తేదీల మధ్య వందలాది జమాత్ ప్రతినిధులు తమ స్వస్థలాలకు రైలు, బస్సు, విమనా మార్గాల ద్వారా చేరుకున్నారు. వీరి ద్వారా వందలాది లోకల్ కాంటాక్టులు ఏర్పడ్డాయి. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, పంజాబ్, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో వందల సంఖ్యలో కేసులు నమోదు కావడం గమనార్హం.
మర్కజ్ ఘటన భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తికి కేంద్ర బిందువుగా నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సంఘటన వెలుగులోకి వచ్చాక కొంతమంది హిందువులు ముస్లింలు విమర్శలు చేయడం..అదే సమయంలో కొంతమంది జమాత్ ప్రతినిధులు తమ జర్నీ హిస్టరీ చెప్పకుండా ఉండటం వివాదాస్పదమైంది. అంతేకాదు వైద్యులపై దాడులకు పాల్పడం గమనార్హం. ఐసోలేషన్వార్డులో ఉన్నవారు కూడా తమకు బిర్యానీ కావాలని కోరడం, నర్సులతో అసభ్యంగా ప్రవర్తించడం వంటి సంఘటనలతో హిందువుల్లో కొంతమంది కాస్త ఘాటుగానే విమర్శలు చేశారు.
కొంతమంది దుందుడుకు స్వభావం, వ్యవహారశైలితో మొత్తం తమ ముస్లిం సమాజానికి చెడ్డపేరు వస్తోందని ఆవేదన వ్యక్తం చేసినవారూ ఉన్నారు. కరోనా వైరస్ వ్యాప్తికి ముస్లింలు కారణమయ్యారనే ఆరోపణలతో కోట్లాదిమంది ముస్లింల మనస్సు నొచ్చుకుంది. ముస్లింలు కావాలనే వైరస్ను వ్యాప్తి చేస్తున్నారన్న విమర్శలు వినిపించాయి. అయితే ముస్లిం సమాజం కూడా దానికి ఘాటుగానే స్పందించింది. అయితే కరోనా వైరస్ దేశంలో తగ్గుముఖం పట్టాకా హిందు ముస్లింల మధ్య కొంత వైరుద్యం కొనసాగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ వైరుధ్యం సమసిపోవడానికి లౌకికవాదులు ముందుకురావాల్సిన అవరసముందని చెబుతున్నారు.