బతికుంటే బలుసాకైనా తిని బతకవచ్చని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పగా....మందుతాగని బతుకెందుకంటూ కొంతమంది మద్యం ప్రియులు నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. సుదీర్ఘకాలంగా దేశమంతా లాక్డౌన్ కొనసాగుతుండటంతో మద్యం దొరకక మందుబాబులు ఆగమాగమవుతున్నారు. మందు దొరక్కపోవడంతో కొంతమందైతే పిచ్చివాళ్లుగా మారుతున్నారు. వందల కొద్ది ఇలాంటి కేసులు ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రికి చేరుకుంటుండటం చూస్తునేం ఉన్నాం. మద్యం దొరక్క అల్లాడుతున్న మందుబాబులు ప్రభుత్వం వెంటనే వైన్స్షాపులను తెరవాలని గోలపెడుతున్నారు. అయితే దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి. ముంబైలో అయితే ఏకంగా కొంతమంది ధర్నాకు దిగడం విశేషం.
ఇన్ని రోజులు లిక్కర్కు దూరంగా ఉండటంతో తమ ఆరోగ్యాలు చెడిపోతున్నాయంటూ కొంతమంది మందుబాబులు చెబుతుండటం గమనార్హం. వాస్తవానికి కూడా ఒకే సారి మద్యం మానేయడంతోనే కొంతమందిలో విపరీతమైన ప్రవర్తనకు, మతిస్థిమితం కోల్పోవడం వంటి సంఘటనలు చూస్తునే ఉన్నాం. అయితే దశల వారీగా లాక్డౌన్ ఎత్తేస్తున్న కేంద్ర ప్రభుత్వం రెడ్ జోన్లు మినహా, గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మద్యం వ్యాపారానికి 4 నుంచి అనుమతులిచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనిపై భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. మద్యం షాపులు తెరవడం వల్ల సామాజిక దూరం అనేది పాటించడం హుళక్కే అవుతుందన్నది వాస్తవం.
తాగక ముందే కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు పాటించడంలో నిర్లక్ష్యం కొట్టచ్చినట్లు కనబడుతుండగా తాగాక మందుబాబుల నుంచి సామాజిక దూరం పాటించడం ఉంటుదనుకుంటే కలేనని చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఊరూరా..వాడవాడనా..బెల్ట్షాపుల రూపంలో అత్యంత ఈజీగా కొనుగోళ్లకు అవకాశం కలిగిన విషయం తెలిసిందే. ఇక ప్రభుత్వాలు మద్యాన్ని ప్రధాన ఆదాయ మార్గంగా వాడుకుంటున్నాయి. మెదక్ జిల్లా తూప్రాన్ మండలకేంద్రంలోని శ్మశాన వాటికలో ఓ వ్యక్తి కొద్దిరోజులుగా గుడిసె వేసుకొని మద్యం విక్రయం జరుపుతుండటం విశేషం. ఈ విషయంన తెలుసుకున్న మందుబాబులు నిత్యం వందలాది మంది అక్కడికి వెళ్లి బాటిళ్లు తీసుకెళ్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. మద్యం కోసం మందుబాబులు ఎక్కడికైనా వెళ్తారని చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఇంకేమీ లేదు.