వైఎస్ జగన్మోహన్రెడ్డి అనే నేను.. ఏపీ ముఖ్యమంత్రిగా- అంటూ విజయవాడ ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియంలో సీఎంగా జగన్ ప్రమాణం చేసి ఏడాది పూర్తయింది. మరి ఈ ఏడాది పాలనలో ఇటీవల కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా రెండు మాసాల పాలనను పక్కన పెట్టినా.. మిగిలిన పది నెలల పాలన ఎలా ఉంది? ఆరు నెలల సమయం చాలు మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటానని చెప్పిన ఆయన ఆదిశగా అడుగులు వేశారా? ప్రజలకు చేరువ అయ్యారా? అంటే.. నిర్ద్వంద్వంగా ఔననే చెప్పాలి. ఎక్కడా తడబాటు లేకుండా తాను ఏం చేయాలను కున్నారో.. ప్రజలకు ఎన్నికల సమయంలో ఏం చెప్పారో తూ.చ తప్పకుండా దానిని పూర్తి చేయడం లో జగన్ సక్సెస్ అయ్యారనడంలో సందేహం లేదు.
అధికారంలోకి వస్తూనే అంటే ప్రమాణ స్వీకారం నాడే ఆయన కొన్ని కీలక ప్రతిపాదనలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వలంటీర్ వ్యవస్థను తీసుకు వస్తానని చెప్పారు. అనుకున్నదే తడువుగా ఆయన నియామకం చేశారు. ఫలితంగా ప్రజలకు పాలన చేరువ అయింది. అదేసమయంలో పోలీసులకు వీక్లీఆఫ్ అమలు చేయడం ద్వారా దేశంలోనే ఏపీ గుర్తింపు పొందింది. ఇక, రైతు భరోసా కార్యక్రమాన్ని 2020 నుంచి అమలు చేస్తామని చెప్పిన జగన్.. అప్పటికే ఇబ్బందుల్లో ఉన్న రైతులను ఆదుకునేందుకు చెప్పిన దానికంటే ఏడాది ముందుగానే రైతు భరోసాను అమలు చేశారు.
ఇక, అమ్మ ఒడి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని జనవరిలోనే పేద వర్గానికి చెందిన తల్లుల ఖాతాలో రూ.15000 వేశారు. ఇక, మద్య నిషేధం అమలు చేసే క్రమంలో తీసుకున్న కీలక నిర్ణయం నభూతో అన్నవిధంగా సాగింది. మద్యం ధరలను పెంచడంతోపాటు.. దుకాణాల సంఖ్య ను కూడా భారీ ఎత్తున తగ్గించారు. వచ్చే నాలుగేళ్లలో పూర్తిగా మద్యం దుకాణాలు తగ్గించాలనే సంకల్పంతో దీనిని అమలు చేయడాన్ని దేశవ్యాప్తంగా కూడా ప్రభుత్వాలు హర్షించాయి. మహిళలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో యాభై శాతం రిజర్వేషన్లు, నామినేటెడ్ పదవుల్లో యాభై శాతం రిజర్వేషన్లు అమలు చేశారు.
అన్నింటికన్నా హైలెట్గా రాష్ట్రంఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ.. ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకువెళ్లారు. రాజధానికి అమరావతి సరైన ప్రాంతం కాదంటూ.. రాజధాని వికేంద్రీకరణకు మొగ్గు చూపారు. అయితే, ప్రస్తుతం ఇది ప్రాసెస్లో ఉండడంగమనార్హం. అదేసమయంలో పింఛన్లను రూ.250 చొప్పున పెంచడం కూడా ఓ హిస్టరీ! ఏటా ఉద్యోగ కల్పన చేసే దిశగా కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇలా అనేక విధాల తన పాలనలో జగన్ మెరుపులు మెరిపించారనే చెప్పాలి. అయితే, ఇంకా నాలుగేళ్ల సమయం ఉన్న నేపథ్యంలో మరిన్ని పథకాలకు జగన్ ప్రాణం పోసే అవకాశం ఉందని తెలుస్తోంది.