వ్యాపారాల్లోనే కాదు.. రాజకీయాల్లోనూ వారసులకు అవకాశం కల్పించాలనే కోరిక నేటి రాజకీయాల్లో నేతలకు ఎక్కువగానే ఉం ది. గత ఏడాది ఎన్నికల్లో చాలా మంది తాము తప్పుకొని మరీ వారసులకు అవకాశం కల్పించారు. ఈ పరిస్థితి మిగిలిన పార్టీల్లో కంటే కూడా టీడీపీలో ఎక్కువగా కనిపించింది. అనంతపురంలో ఈ తరహా పరిస్థితి బాగా కనిపించింది. ఇక, వారసులను రంగంలోకి దింపాలని భావించిన కొందరికి గత ఏడాది అవకాశం లభించలేదు. దీంతో అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు తామే కష్టమో.. నష్టమో.. పోటీకి సిద్ధమయ్యారు. ఇలాంటి వారిలో ఒంగోలు ఎంపీగా పోటీ చేసిన మాజీ మంత్రి, దర్శి మాజీ ఎమ్మెల్యే శిద్దా రాఘవరావు ఒకరు. ఆయన తన కుమారుడు శిద్ధా సుధీర్బాబును రాజకీయాల్లోకి తీసుకురావాలని ఉవ్విళ్లూరారు.
ఈ క్రమంలోనే తాను మంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గంలోని వైద్య శాఖలో నామినేటెడ్ పదవిని ఇప్పించుకున్నారు. నియోజకవర్గంలో ప్రజలకు బాగానే పరిచయం చేశారు. ఏ కార్యక్రమమమైనా తన కుమారుడి చేతుల మీదుగా జరిగేలా ప్లాన్ చే సుకున్నారు. అదేసమయంలో పార్టీలోనూ నేతలకు బాగానే పరిచయం చేశారు. అధినేత చంద్రబాబు దగ్గర కూడా మార్కులు పడేలా యువ నేతను ప్రోత్సహించారు. చంద్రబాబు కుమారుడు, మాజీ మంత్రి నారా లోకేష్ టీంలో కూడా సభ్యుడయ్యేలా సుధీర్ను ప్రోత్సహించారు. తండ్రి ప్రోత్సాహంతో సుధీర్ కూడా పుంజుకున్నారు. అయితే, ఎన్నికల సమయానికి సమీకరణలు మారిపోయాయి. అనంతపురంలో యువ నేతలకు టికెట్లు ఇచ్చినా.. ప్రకాశం వచ్చే సరికి మాత్రం చంద్రబాబు తన పంథాను మార్చుకున్నారు. దీంతో సుధీర్ పోటీకి దూరమయ్యారు.
ఇదే సమయంలో రాఘవరావుకు కూడా ప్రాధాన్యం మారిపోయి.. దర్శి నుంచి తీసుకువచ్చి.. ఒంగోలు నుంచి పోటీ చేయించారు. దీంతో ఆయన ఎంపీగా రంగంలోకి దిగారు. కానీ, వైసీపీ నుంచి తీవ్రమైన పోటీ ఉండడం సహా .. టీడీపీలోనే కొన్ని వర్గాలు సహక రించని(ప్రచారంలో ఉంది) కారణంగా రాఘవరావు ఓడిపోయారు. దీంతో ఇప్పుడు తన కన్నా.. తన కుమారుడిపైనే ఆయన బెం గ పెట్టుకున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. తన కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకువచ్చి గెలిపించుకోవాలనే కోరిక బలంగానే ఉన్నా.. ఇప్పుడు మారిన పరిస్థితుల నేపథ్యంలో టీడీపీలోనే ఉండడం వల్ల ప్రయోజనం ఏంటనేది ఆయనను వేధిస్తున్న ప్రశ్న. కొన్నేళ్లుగా తాను టీడీపీలోనే ఉన్నప్పటికీ.. ఇప్పుడు రాష్ట్రంలో మారిన పరిస్థితి మాత్రం శిద్దాకు మింగుడు పడడం లేదు.
దీంతో ఇంకా టీడీపీలోనే ఉండి సాధించేది ఏంటి? అనేది ప్రధానంగా శిద్దాను వేధిస్తున్న ప్రశ్న. ఇప్పటికే ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ మోస్ట్ నాయకుడు ఒకరు తన కుమారుడి భవిష్యత్తు కోసం వైసీపీతో జత కట్టారు. ఇలానే తాను కూడా వైసీపీకి మద్దతు ప్రకటిస్తే.. మంచిదనే అభిప్రాయం శిద్దాకు ఉందనే ప్రచారం సాగుతోంది. అయితే, ఈ విషయంలో వైసీపీ తొలుత ఓకే చెప్పినా.. తర్వాత ఎందుకో.. వెనక్కి తగ్గింది. దీనికి ఒంగోలు ఎంపీ అడ్డు పడుతున్నారనే వాదన కూడా ఉంది. ఫలితంగా ఇప్పుడు శిద్దా తన కుమారుడిని రాజకీయంగా ఎలా హైలెట్ చేయాలనే విషయంలో సతమతమవుతున్నారు. ఈ విషయంలో నేరుగా సీఎం జగన్ను కలిసి మాట్లాడాలనే ప్రయత్నంలో ఉన్నారని, అప్పాయింట్మెంట్కోసం కూడా ప్రయత్నిస్తున్నారని శిద్దా అనుచరులు అంటున్నారు. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి.