కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వ్యవస్థలు అన్ని కుప్పకూలిపోయాయి. ఇవి కోలుకునేందుకు రోజులు.. నెలలు కాదు ఎన్నేళ్లు పడుతుందో ? తెలియని పరిస్థితి. ఈ క్రమంలోనే రాష్ట్రాలను.. వలస కార్మికులను ఆదుకునేందుకు మేం ఉన్నామంటూ ముందుకు వచ్చింది. రెండు రోజుల క్రితం మోదీ భారీ ప్యాకేజ్ ప్రకటించారు. ఈ ప్యాకేజ్ మార్గదర్శకాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటిస్తారని ఆయన సరిపెట్టారు. ఇక నిర్మల బుధవారం.. గురువారం వరుసగా ప్రెస్మీట్లు పెడుతూ లెక్కల మీద లెక్కలు చెపుతున్నారు. చిత్రగుప్తుడి పద్దులా చాంతాడంత ఫైల్స్ పట్టుకుని వచ్చి ఆమె విలేకర్ల ముందు చదువుకుంటూ పోతున్నారు.
కరోనా నేపథ్యంలో ఎన్నో ఇబ్బందులు పడిన సామాన్యుడికి ఈ లెక్కలు... గిక్కలు ఏ మాత్రం అర్థం కావడం లేదు. అసలు నిర్మల చెప్పిన లెక్కల్లో సవాలక్ష సందేహాలు ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాయి. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎంతో మందికి ఏదేదో చేశాం అంటూ లెక్కలు చెపుతున్నా వాస్తవానికి అవి కేంద్ర నిధులతో చేశారా ? లేదా రాష్ట్రాలు చేసుకున్నవేనా ? అన్నది క్లారిటీ లేదు. రుణాలు ఇస్తామని గొప్పలు చెపుతున్నా వీటికి ఎలాంటి మార్గదర్శకాలు లేవు. ఇక పూచికత్తు లేకుండా నాలుగేళ్ల పరిమితిలో రుణాలు ఇస్తాం అని చెపుతున్నా.. ఇప్పుడు బ్యాంకులు దయ తలుస్తాయా ? అన్నది పెద్ద ప్రశ్న. ఇప్పుడు ఫ్రూప్లు ఉన్న వాళ్లకే ఎలాంటి రుణాలు ఇవ్వడం లేదు... ఇప్పుడు కేంద్రం చెప్పితే మాత్రం పూచికత్తు లేని రుణాలు ఎందుకిస్తాయన్నది కేంద్రం చెప్పదు. దీనిని బట్టి కేంద్రం మాటలు ప్రకటనలకేనా ? అన్న సందేహాలు చాలా మందిలో ఉన్నాయి.
ఆర్థిక కష్టాల్లో ప్రజలు ఉన్నారని తెలిసి బ్యాంకులు రుణాలు ఎందుకు ఇస్తాయన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇక దేశంలో 8 కోట్ల మంది వలస కార్మికులు ఉన్నారని చెపుతున్నారు... వలస కార్మికులను గుర్తించడానికి ప్రతిపాదిక ఏది అన్నది తెలియడం లేదు. అసలు వీరి గుర్తింపే సరిగా జరగలేదన్నది అందరికి తెలిసిందే. వలస కార్మికుల ఆరోగ్యం... ఉపాధి గురించి కేంద్రానికి సరిగా తెలియదు. ఇక ఇప్పుడు విడుదల చేసే నిధులు కూడా ఉత్తరాది రాష్ట్రాలకే ఎక్కువ వెళ్లనున్నాయి. దక్షిణాది రాష్ట్రాలకు జనాభా ప్రాతిపదికన చాలా చాల తక్కువ నిధులు మాత్రమే వస్తాయి.
ఉదాహరణకు దేశంలో పెద్ద రాష్ట్రాలుగా ఉన్న యూపీ, బిహార్కే సగం నిధులు వెళ్లిపోనున్నాయి. అసలు కేంద్రం చెపుతున్నట్టు ప్యాకేజీ అంటే అప్పులు ఇవ్వడమా ? అన్నది తెలియడం లేదు.. ఇది ప్యాకేజీ ఎలా అంటారో తెలియని పరిస్థితి. ఇక మోదీ చెప్పినట్టు వాస్తవానికి ఇది జీడీపీలోని 10 శాతం కాదని ఆర్థిక మేథావులు చెపుతున్నారు. ఇక ఈ మాత్రం ప్రకటనలకు బుధవారమే కాకుండా గురువారం కూడా ప్రెస్మీట్ పెట్టి సుదీర్ఘమైన ఉపన్యాసం చేశారు.
గురువారం ప్రెస్ మీట్లో ఇప్పటికే రు. 25 వేల కోట్ల నాబార్డు రుణాలను రీ ఫైనాన్స్ చేశామని ప్రకటించిన ఆమె దేశ వ్యాప్తంగా ఉన్న వలస కూలీలకు కొన్ని అదిరే ఆఫర్లు ప్రకటించారు. ఆగస్టు వరకు దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చని తెలిపారు. ఇక పట్టణాల్లో కొత్తగా 7200 స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్టు కూడా నిర్మల చెప్పారు. 8 కోట్ల మంది వలస కూలీలకు ఇప్పటికే ఎస్డీఆర్ఎఫ్ కింద వలస కూలీలకు బస, ఆహారం.. తాగునీరు అందించామని... పట్టణ పేదలకు 1.25 లక్షల వేల శానిటైజర్లు, 3 కోట్ల మాస్క్లు పంపిణీ చేశామని చెప్పినా ఇవి సామాన్యుడికి నిజమైన ఊరట.. ఆర్థిక స్వావలంబన... వారు కోలుకునేందుకు అయితే ఎంత వరకు ఉపయోగపడతాయన్నది మాత్రం సందేహమే.