ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావంతో వ్యవస్థలు అన్ని ఎలా కుప్ప కూలిపోయాయో గత నెల రోజులుగా చూస్తూనే ఉన్నాం. కరోనా దెబ్బతో ప్రపంచంలో అన్ని దేశాలు కొన్ని లక్షల కోట్లు నష్టపోయాయి. ఇక సామాన్య, మధ్య తరగతి సగటు మనిషి పడుతోన్న బాధలు అన్నీ ఇన్నీ కావు. ఇక ఈ ప్రభావం మన దేశంపై తీవ్రంగా చూపింది. కరోనాను కట్టడి చేసే విషయంలో ఇప్పటికే మూడు సార్లు కంటిన్యూ అయిన లాక్ డౌన్ 4.0 కూడా కొనసాగుతోంది. ఇక మన దేశంలో ఇప్పటికే చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ కంటిన్యూ చేస్తుండగా కొన్ని చోట్ల మాత్రం పాకిక్షంగా లాక్ డౌన్ కంటిన్యూ అవుతోంది. ఇదిలా ఉంటే ఈ కరోనా ముప్పు వల్ల భారత్ లో అన్ని వ్యవస్థల్లోనూ ఉద్యోగాల్లో తీవ్రమైన కోతలు వాతలు తప్పట్లేదు.
మీడియా రంగంలో అయితే వేలాది మంది ఉద్యోగులు కుటుంబాలతో సహా రోడ్డున పడుతున్నారు. ఇక అసంఘటిత రంగ కార్మికుల ఆకలి కేకలతో వారు పడుతోన్న బాధలు వర్ణనాతీతంగా మారాయి. ఇక పలు ప్రైవేటు సంస్థలు సైతం ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా పీకేయడమో లేదా ? వారి జీతాలను ఏకంగా సగానికి పై గా కోత పెట్టేయడమో చేస్తున్నాయి. ఇక భారత్లో ఈ కరోనా వల్ల కోల్పోతున్న ఉద్యోగాల సంఖ్య చూస్తే కళ్లు జిగేల్ మనిపించక మానదు. మన దేశంలో కరోనా వల్ల మొత్తం 13.5 కోట్ ఉద్యోగాలకు ఎసరు తప్పదని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
ఇక ఈ ప్రభావంతో ఆ 13.5 కోట్ల మందితో పాటు వారిపై ఆధార పడిన కుటుంబ సభ్యుల జీవనానికి కూడా కష్టమే అంటున్నారు. ఇదిలా ఉంటే మరో 12 కోట్ల మంది పేదరికంలోకి వెళ్లిపోతారని ఇంటర్నేషనల్ మేనేజ్ మెంట్ కన్సల్టింగ్ సంస్థ ఆర్థర్ డి.లిటిల్ అంచనా వేసింది. మన దేశ జీడీపి కూడా 2020-21 నాటికి 10.8 శాతానికి పడిపోతుందని... ఇది 2021-22లో కేవలం 0.8 శాతం వృద్ధి నమోదు కావొచ్చని నివేదిక అంచనా వేసింది. ఇక నిరుద్యోగ రేటు కూడా దేశంలో తీవ్రంగా పెరిగి పోనుంది. ఇది ఇప్పటి వరకు 7.6 శాతం ఉండగా ఇది రేపో మాపో ఏకంగా 35 శాతానికి పైగా వెళ్లి పోతుందని అంచనా వేస్తున్నారు. దీంతో 13.6 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోవడమే కాకుండా మొత్తం 17.4 కోట్ల మంది నిరుద్యోగులుగా మారతారట.