ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నాటి నుండే వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అనేక విమర్శలు చుట్టుముడుతున్నాయి. ఆయన్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రతిపక్షాలు ఎన్నో అంశాలను లేవనెత్తాయి. పాలనా పరమైన విమర్శలతో పాటు వ్యక్తిగత విమర్శలు కూడా చేశారు.. జగన్ అధికారంలోకి వచ్చాక మొదటినుంచీ ఆయన హిందూ మతంపై కక్షకట్టారనే ప్రచారం పెద్ద ఎత్తున మొదలుపెట్టారు.
టీటీడీ ఛైర్మన్గా క్రైస్తవుడిని నియమించారని, కొండపైన చర్చి కట్టారనే ప్రచారం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున జరిపారు. కానీ, ఇవి రెండు అబద్ధాలే అని తేలాయి. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నికార్సైన హిందువు అని తేలగా తిరుమల కొండపైన నిర్మించింది చర్చి కాదు, అది ఒక అటవీ శాఖ కార్యాలయం అని తేలింది. అయితే, అబద్ధాలనే అంతపెద్ద ఎత్తున ప్రచారం చేసి తనపై హిందు వ్యతిరేకి అనే ముద్ర వేయాలనుకున్నారు కాబట్టి మతానికి సంబంధించి, ఆలయాలకు సంబంధించిన సున్నితమైన అంశాలపై తీసుకోవాల్సిన నిర్ణయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
కానీ, టీటీడీ ఈ విషయాన్ని పట్టించుకోలేదు. ఇతర రాష్ట్రాల్లో తిరుమల శ్రీవారికి విరాళంగా దాతలు ఇచ్చిన ఆస్తులను వేలం ద్వారా విక్రయించాలని వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఈ విషయం బయటకు రాగానే పెద్ద ఎత్తున జగన్పై, ఆయన ప్రభుత్వంపై విమర్శలు మొదలయ్యాయి. హిందుత్వాన్ని జగన్ నాశనం చేయాలని చూస్తున్నారని బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించడం ప్రారంభించారు. ఆస్తుల అమ్మకం నిర్ణయానికి వ్యతిరేకంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సోషల్ మీడియా ద్వారా చర్చ మొదలైంది. అమ్మకానికి తిరుమల అంటూ ఏకంగా తిరుమలనే జగన్ ప్రభుత్వం అమ్మేస్తోంది అంటూ జగన్ వ్యతిరేక మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది.
అయితే, ఇది టీటీడీ తీసుకున్న నిర్ణయమని, ఈ నిర్ణయానికి ప్రభుత్వానికి సంబంధం లేదని టీటీడీ తేల్చేసింది. నిరర్థక, నిర్వహణ భారంగా మారిన ఆస్తులను అమ్మడం కొత్తేమీ కాదని 1974 నుంచి 129 ఆస్తులను టీటీడీ విక్రయించిందని వివరణ కూడా ఇచ్చింది. ఇప్పుడు అమ్మకానికి పెట్టిన ఆస్తులను గతంలోనే టీడీపీ ప్రభుత్వ హయాంలోనే గుర్తించి అమ్మాలనుకున్నారని టీటీడీ చెప్పడంతో తాత్కాలికంగా ఈ వివాదం చల్లబడింది. వాస్తవానికి ఇవన్నీ తెరపైకి రావడానికి ముఖ్యకారణం ఏంటంటే..సీఎం జగన్ ని హిందు వ్యతిరేకిగా ముద్రవేసి, హిందువుల్లో ఆయనపై వ్యతిరేకతను తీసుకొచ్చి ఆయన ప్రభుత్వానికి హిందువులను దూరం చేయాలన్నదే ప్రతిపక్షం ముఖ్య ఉద్ధేశంగా మనకు కనిపిస్తుంది. అయితే ప్రతిపక్షం ఊహించిన విధంగా జరగకపోవడంతో, ఇప్పుడు “దళితులు” అనే మరో కొత్త అస్త్రాన్ని జగన్ సర్కార్ పై ప్రయోగిస్తుంది ప్రతిపక్షం.
డాక్టర్ సుధాకర్ ప్రభుత్వంపై బహిరంగ ఆరోపణలు చేయగానే.. మీడియా అలాగే రాజకీయం ఆయన కులాన్ని బహిర్గతం చేసింది. పైగా ఆయన కులం అడ్డం పెట్టి ప్రభుత్వంపై యుద్ధం చేసేందుకు రాజకీయ ప్రయంత్నం చేసింది. కులాధిపత్యంతో నడిచే మీడియా కూడా డాక్టర్ సుధాకర్ కులాన్ని ముందుపెట్టి రాజకీయ పోరాటానికి ఊతం ఇచ్చే ప్రయత్నం చేసింది. అయితే ఇలాంటి ప్రయత్నాలు మొన్న గుంటూరులో అరెస్టు అయిన మహిళ రంగనాయకమ్మ విషయంలో జరగలేదు. ఆమె విషయంలో జెండర్ ప్రధాన భూమిక పోషిస్తోంది. డాక్టర్ సుధాకర్ విషయంలో వర్తించిన కులం ఇక్కడ మాయం అయింది. అయితే ఇక్కడ గమయించాల్సింది ఏమంటే డాక్టర్ సుధాకర్ కానీ, రంగనాయకమ్మ కానీ తమ కుల లేదా లింగ స్పృహతో ప్రభుత్వంపై విమర్శలు చేయలేదు. వారు రాజకీయ ప్రత్యర్ధులుగానే విమర్శలు చేశారు.
డాక్టర్ సుధాకర్ టీడీపీ అభిమాని. పైగా పాయకరావుపేట ఎమ్మెల్యే సీటు కోసం గత కొన్నేళ్ళుగా అయ్యన్నపాత్రుడు ద్వారా ప్రయాత్నాలు చేస్తున్న వ్యక్తి. ఆయన విమర్శలు కూడా రాజకీయపరమైనవే. అవి వివాదం కావడంతో కులం అస్త్రం ప్రయోగిస్తున్నారు. దీని ద్వారా జగన్ సర్కార్ పై దళితుల్లో వ్యతిరేకత తేవాలన్నది ప్రతిపక్షం ముఖ్య ఉద్ధేశం, ఇందులో భాగంగా డాక్టర్ సుధాకర్ పేరుచెప్పి దళితులపై తమకు ఎక్కడలేని ప్రేమ ఉందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ప్రతిపక్షం నేతలు. కానీ, అధికారంలో ఉన్నప్పుడు కళ్లు మూసుకుపోయి టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా మరి కొంతమంది ముఖ్యనేతలు దళితులపై చేసిన వ్యాఖ్యలు తెలుగు ప్రజలు ఎవ్వరూ మరిచిపోలేదు అన్న విషయం వీరు మరిచినట్లున్నారు. మరి అలాంటి వారి ట్రాప్ లో పడి దళిత వర్గం జగన్ సర్కార్ కు దూరం అవుతుందా అంటే జరిగే పని కాదు అని తెలుస్తుంది. ఇకనైనా ప్రతిపక్షం కులం, మతం, వర్గం పేర్లు చెప్పుకొని చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని ఆశిస్తున్నాను.