మోడీ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకోబోతుందా..? కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పై వేటు వేయడానికి రెడీ అవుతోందా..? నిర్మలా సీతారామన్ స్థానంలో సీనియర్ బ్యాంకర్ కేవీ కామత్ ను తీసుకురానున్నార ..? అంటే.. ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. అసలు కేంద్ర ప్రభుత్వం ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకోవడానికి ముఖ్యకారణం ఏంటంటే..
కరోనా వైరస్ దెబ్బకు దేశ ఆర్థిక వ్యవస్థ పాతలంలోకి పడిపోయిందనే చెప్పాలి… దీంతో పరిస్థితులను చక్కదిద్దడంలో విఫలమయ్యారన్న విమర్శలను ప్రతిపక్షాల నుంచి మోదీ సర్కారు ఎదుర్కొంటున్నది. ఈ క్రమంలోనే ఆర్థిక శాఖ పగ్గాలను మరింత సమర్థుల చేతికి అప్పగించాలన్న నిర్ణయానికి ప్రధాని మోడీ సర్కార్ వచ్చినట్లు తెలుస్తున్నది. వాస్తవానికి భారత తొలి పూర్తిస్థాయి మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ చరిత్ర సృష్టించారు. అయితే వరుసగా రెండోసారి కేంద్రంలో అధికారం చేపట్టిన మోదీ సర్కారుకు ఈసారి ఆర్థిక పరిస్థితులు అస్సలు అనుకూలించడం లేదు. తొలి ఐదేండ్లు దూసుకుపోయిన జీడీపీ.. మలి దఫా ఆరంభంలోనే పడకెక్కేసింది.
పాత పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ సెగలతో బక్కచిక్కిపోయిన వృద్ధిరేటును కరోనా చంపేస్తున్నది. ఈ క్రమంలో జీడీపీ బలోపేతానికే కేంద్రం తొలి ప్రాధాన్యతను ఇస్తున్నది. అందుకే ఆర్థిక మంత్రిగా అనుభవజ్ఞుల్ని పెట్టాలని కేంద్రం చూస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే మోడీ సర్కార్ చూపు కేవీ కామత్ పై పడింది. ప్రస్తుతం ఈయన బ్రిక్స్ దేశాల న్యూ డెవలప్ మెంట్ బ్యాంకు (ANDB) చీఫ్ గా ఉన్నారు. ఈ పదవిలో ఐదేళ్ల నుండి ఉన్నారు కేవీ కామత్.. కాగా, జులై నెలలో ఈయన పదవి కాలం ముగుస్తుండటంతో ఈ బాధ్యతలు వేరే వారికి అప్పజెప్పనున్నారు. దీంతో కేంద్ర ఆర్ధిక మంత్రిగా కామత్ ను తీసుకుంటారనే ప్రచారం జరుగుతుంది. అలాగే అంబానీలతో ఉన్న సత్సంబంధాలు కూడా కామత్ ను ఆర్థిక మంత్రి రేసులో ముందుంచుతున్నాయి. ముకేశ్, అనిల్ అంబానీల ఆస్తుల పంపకాల్లో కామత్ పెద్ద దిక్కుగా వ్యవహరించారు. అయితే ఇప్పుడున్న కార్పొరేట్ వ్యవహారాల శాఖను నిర్మలకే కేటాయించే అవకాశాలున్నట్టు తెలుస్తుంది.