ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా తెలుగు మీడియా తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయింది. అసలు గత యేడాది కాలంగానే తెలుగు మీడియా పరిస్థితులు ఎంత మాత్రం బాగోలేదు. ఏం చేయాలా ? ఉద్యోగుల భారం ఎలా తగ్గించుకోవాలా ? అని ఎదురు చూస్తోన్న వేళ కరోనా రావడంతో పలు మీడియా సంస్థలు నిర్దాక్షిణ్యంగా ఉద్యోగులను పీకేశాయి. మరి కొన్ని సంస్థలు అయితే 30 నుంచి ఏకంగా 50 శాతం వరకు జీతాలు కోసి పడేశాయి .అదేంటి అని అడిగే దిక్కు లేదు. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఉన్న ఈ ఉద్యోగం కూడా పీకేస్తాం అని వార్నింగులు రావడంతో చాలా మంది ఉద్యోగులు తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆ సగం జీతంతోనే పొట్ట నింపుకుంటూ కుటుంబాన్ని పోషించు కుంటున్నారు.
ఇక నిన్నటి వరకు మీడియా రంగంలో టాప్ ప్లేస్లో ఉన్న ఈనాడు ఉద్యోగులకు వచ్చిన ఇబ్బందేమి లేదని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు ఈనాడు కూడా కోతల వాతలు ప్రారంభించేసింది. సహజంగా ఈనాడు అంటే జీతాలు ఠంచనుగా ఒకటో తేదీకి పడిపోతాయి. ప్రతి నెలా చివరి రోజు బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. చివరి రోజు ఏదైనా సెలవు ఉంటే ముందు రోజే వేసేస్తారు. అయితే ఇప్పుడు జీతాలు 10 రోజులు లేట్ గా వేశారని ఓ టాక్. అయితే ఇప్పుడు ఈనాడు వర్గాల్లో మరో పిడుగు లాంటి వార్త కూడా వినిపిస్తోంది.
ఈనాడు ఉద్యోగుల జీతాల్లో 20 నుంచి 40 శాతం మేర ఉండే అవకాశం ఉందని ఉద్యోగులు చెబుతున్నారు. తెలుగులోని ప్రధాన పత్రికల్లో సాక్షి తప్ప..అన్ని పత్రికల్లో వేతనాల కోత అమలు అవుతోంది. ఇఫ్పటికే ఆంధ్రజ్యోతి వేతనాల్లో భారీగానే కోత వేసింది. ఇక మిగిలిన పత్రికల గురించి ఎంత మాట్లాడుకుంటే అంత తక్కువ. ఎవరి దగ్గర నుంచి అయినా వసూళ్లు చేసుకుని మీరు కొంత తీసుకుని... మాకు కొంత ఇవ్వండి అన్నట్టుగా వారి వ్యవహారం నడుస్తోంది.
మరో రెండు ఛానెల్స్ మూత :
ఇక తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా పెద్ద సంక్షోభంలో ఉంది. అసలు ఎవరూ ఛానెల్స్ కు ప్రకటనలు ఇవ్వడం లేదు. గత మూడు నెలలుగా పత్రికల్లో ఒకటి అరా తప్ప..పెద్దగా ప్రకటనలు కన్పించటం లేదు. పత్రికల ప్రధాన ఆదాయం ప్రకటనలే అన్న సంగతి తెలిసిందే. పేపర్ల పరిస్థితే ఇలా ఉంటే ఇక ఛానెల్స్ కు మాత్రం ఎవరు ప్రకటనలు ఇస్తారు. దీంతో తీవ్ర సంక్షోభంలో కూరుకు పోయిన ఓ ఏపీ బేస్ ( తొలి ఏపీ బేస్ న్యూస్ ఛానెల్ అని డప్పేసుకున్నారు ) న్యూస్ ఛానెల్ మూతకు రెడీ అవుతోందట. అలాగే మరో న్యూస్ ఛానెల్ గత పదేళ్ల నుంచి లాస్లోనే ఉంది. ఆ ఛానెల్ కూడా త్వరలోనే మూసి వేయడం లేదా ఎవరికి అయినా అమ్మేస్తారని టాక్..?