ప్రస్తుతం అటు సినిమా వార్తల్లోనూ.. ఇటు రాజకీయ వార్తల్లోనూ యువరత్న నందమూరి బాలకృష్ణ హాట్ టాపిక్ గా మారారు. తెలుగు సినిమాలో కొంత మంది హీరోలు, దర్శక నిర్మాతలు మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇండస్ట్రీలో ఈ కలయిక పై కొందరు అనుకూలంగాను.. మరి కొందరు వ్యతిరేకంగాను మాట్లాడుతున్నారు. బాలయ్య ఈ మీటింగ్కు తనను ఎవ్వరూ పిలవలేదని.. వాళ్లంతా శ్రీనివాస్ యాదవ్ తో కలిసి కూర్చుని భూములు పంచుకునేందుకు మీట్ అయ్యారని విమర్శలు చేశారు.
ఇక బాలయ్య వ్యాఖ్యలకు మెగా బ్రదర్ నాగబాబు కౌంటర్ కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు సినిమా పరిశ్రమలో పెద్దలు అందరూ కలిసి చిరంజీవి ఆధ్వర్యంలో ఈ నెల 9న ఏపీ సీఎం జగన్ను కలుస్తోన్న సంగతి తెలిసిందే. ఇక జగన్ ముఖ్యమంత్రి అయ్యాక చిరంజీవి దంపతులను తన ఇంటికే పిలిచి విందు కూడా ఇచ్చారు. ఏపీలో సినిమా షూటింగ్లు.. అక్కడ సినిమా పరిశ్రమ అభివృద్ధి.. ప్రభుత్వ సహకారం కోసమే వీళ్లంతా జగన్ను కలుస్తున్నారు. అయితే ఈ మీటింగ్కు బాలయ్య వెళ్లడం లేదు. ఇందుకు ఈ నెల 10న బాలయ్య పుట్టిన రోజు ఉండడమే ప్రధాన కారణం.
ఇదిలా ఉంటే తెలంగాణ సీఎం కేసీఆర్ను త్వరలోనే బాలయ్య కలుస్తున్నారని సమాచారం. చిరంజీవి ఆధ్వర్యంలో కొందరు కేసీఆర్ను కలిశాక వచ్చిన విమర్శలు కేసీఆర్ దృష్టికి వెళ్లడంతో కేసీఆర్ దీనిపై దృష్టి పెట్టారట. తాను ఇండస్ట్రీలో కొందరికి మాత్రమే కావాల్సిన వాడిని అన్న ముద్ర వేయించుకోవడం ఆయనకు అస్సలు ఇష్టం ఉండదు. ఇదిలా ఉంటే కేసీఆర్ ను కలిశాక బాలయ్య ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కూడా కలిసే అవకాశం ఉందని అంటున్నారు.
బాలయ్యకు జగన్కు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. పైగా జగన్ బాలయ్యకు అభిమాని. పైగా జగన్ చంద్రబాబుకు షాక్ ఇచ్చే క్రమంలో అయినా బాలయ్యకు అపాయింట్ మెంట్ ఇస్తాడు. అయితే జగన్ను కలిసే విషయంలో చంద్రబాబు నిర్ణయం మేరకు బాలయ్య నడుస్తాడనంలో సందేహం లేదు. ఒక వేళ వీరిద్దరు కలిస్తే బాలయ్య, నందమూరి, వైసీపీ అభిమానులకు పెద్ద పండగే.