ఏపీ సీఎం జగన్కు ఇప్పుడు కావాల్సినంత బలం.. బలంగా రెండూ ఉన్నాయి. ఇక జగన్ చేస్తోన్న పనులు చూస్తుంటే మరో రెండు టర్మ్లు కూడా జగన్కు తిరుగు ఉండదనే అనుకోవాలి. మరోవైపు ప్రతిపక్షాలు ఏపీలో పూర్తిగా బలహీనం అయిపోయాయి. అసలు చంద్రబాబు ను పక్కన పెట్టేస్తే టీడీపీని నడిపించే నాయకుడు ఎవరు ? అన్నది ఆ పార్టీ నేతలకే అర్థం కాని పరిస్థితి. లోకేష్ నాయకత్వంపై నమ్మకం లేదు. ఏతావాతా టీడీపీ తీవ్రమైన నాయకత్వ సమస్యతో కొట్టుమిట్టాడుతూ సంక్షోభం లోకి వెళ్లిపోతోంది. బహుశా ఎన్టీఆర్ను పదవి నుంచి గద్దె దించాక టీడీపీలో ఇప్పుడున్నంత సంక్షోభం ఎప్పుడూ లేదనే చెప్పాలి.
మరోవైపు జనసేన పార్టీ ఉన్నా ఆ పార్టీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. పవన్ కళ్యాణ్ తన అన్న చిరంజీవి లాగా ప్లాప్ షో వేసేందుకు రెడీ అవుతున్నట్టే ఉంది. అసలు పవన్ పార్టీ ఉంటుందా ? లేదా ? అన్న సందేహాలు ఉన్నాయి. అందుకే పవన్ పార్టీని నడిపేందుకే బీజేపీతో కలిసి పోయారు. ఏపీలో మరో పదిహేనేళ్లకు కూడా బీజేపీకి ఓట్లేసే పరిస్థితి లేదు.. జనాలు బీజేపీని ఎంత మాత్రం నమ్మరు. అందులో సందేహం లేదు. మరో వైపు 151 మంది ఎమ్మెల్యేలు.. 22 మంది లోక్సభ సభ్యులు.. భవిష్యత్తులో ఏ ఎన్నిక జరిగినా ఏకపక్ష విజయాలు ఖాయం. ఇంత బలం ఉండి కూడా జగన్కు రావాల్సినంత మైలేజ్, క్రేజ్ ఎందుకు రావడం లేదన్న దానిపై జగన్ & టీం మాత్రం ఆలోచించు కుంటున్నట్టు లేదు.
రంగుల వ్యవహారం విషయంలో జగన్ అంత పట్టుదలకు పోయి ఏకంగా సుప్రీంకోర్టు వరకు వెళ్లి ఎందుకు మొట్టికాయలు వేయించు కోవాల్సి వచ్చిందో ? ఎవ్వరికి అర్థం కాని ప్రశ్న. మద్యం విషయంలో జగన్ ఒక్క వేటుతోనే దీనిని ముగించి ఉంటే సరిపోయేది. కానీ ఇప్పుడు అనుసరిస్తోన్న విధానం వల్ల మందు బాబుల్లోనూ, లిక్కర్ సిండికేట్లలోనూ తీవ్ర వ్యతిరేకత వస్తోంది. వీళ్లు జగన్పై తీవ్రమైన నెగిటివిటి ప్రచారం చేస్తున్నారు. ఇసుక విషయంలో సొంత పార్టీ నేతలే విమర్శలు చేసి.. ప్రభుత్వాన్ని తప్పు పట్టే వరకు ఎందుకు తెచ్చుకున్నారో అర్థం కావడం లేదు. ఇక విశాఖ డాక్టర్ వ్యవహారం అంత రచ్చకీడ్చకుండా ఉండాల్సింది. ఏదేమైనా జగన్ను చుట్టుపక్కల ఉండేవాళ్లు సరిగా గైడ్ చేయడం లేదు. మరి ఈ విషయంలో జగన్ ఇప్పటకి అయినా మేలుకుంటే మంచిది.