నాగబాబు.. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నగా ఎక్కువ గుర్తుంపు పొందిన ఈయన.. ప్రస్తుత కాలంలో వారిని మించి పోతున్నారు. ఎప్పుడూ ఏదోక వివాదం చుట్టూ తిరుగుతూ.. ఒకవేళ ఏ వివాదం లేకపోతే ఆయనే ఒక వివాదాన్ని సృష్టించి వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోతున్నారు. అయితే ఈ మధ్య ఈయన చూపు నందమూరి బాలకృష్ణ మీద పడినట్టు తెలుస్తుంది. అందుకే బాలయ్య చేసే ప్రతీ పనికి, ఆయన మాట్లాడే ప్రతీ మాటకి అందరికంటే ముందుగా నాగబాబు రియాక్ట్ అవుతున్నారు. మొన్న చిరంజీవి నేతృత్వంలో కొందరు సినీ ప్రముఖులు మంత్రి తలసానితో భేటీ అవ్వడంపై బాలయ్య చేసిన విమర్శల మీద నాగబాబు ఘాటుగానే స్పందించారు. ఈ విషయం ఇప్పుడిప్పుడే చల్లారుతుంది అనుకునే లోపు తాజాగా మరోసారి బాలయ్యని కెలికేశాడు నాగబాబు.

 

తన పుట్టిన రోజు సందర్భంగా బాలయ్య నిన్న ఓ పాట పడిన సంగతి అందరికీ తెలిసిందే. అప్పట్లో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన జగదేకవీరుని కథ సినిమాలో ఘంటసాల ఆలపించిన శివశంకరీ పాటను తన గాత్రంతో పాడాడు బాలయ్య. అయితే ఇప్పుడు ఈ పాటపై నాగబాబు స్పందించాడు. బాలయ్య పేరు వాడకుండా.. ఆయన పాడిన పాట ఊసెత్తకుండా కొన్ని పాటలు రీమిక్స్ కంటే ఒరిజినల్స్ బాగుంటాయంటూ బాంబ్ పేల్చాడు. “ఒక్కోసారి ఓల్డ్ సాంగ్స్ రీమిక్స్ కన్నా originals చాలా అద్భుతంగా ఉంటాయి.ఈ తరానికి ఘంటసాల గాత్ర మాధుర్యం విలువ ఈ పాటికె తెలిసుంటది”.. అంటూ నాగబాబు చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. దీంతో వీరి మధ్య మరోసారి రగడ మొదలవబోతుందని నెటిజన్లు అంటున్నారు. పైగా నాగబాబు ప్రతీ దాంట్లో బాలకృష్ణని టార్గెట్ చేయడం వెనుక ఏదైనా రాజకీయ కోణం ఉందా అనే అనుమానాలు సైతం లేవనెత్తుతున్నారు. ఏది ఏమైనప్పటికి నాగబాబు వ్యవహారం ఎవరికి అర్ధం కాని విధంగా ఉంది. మరి నాగబాబు చేసిన ఈ కామెంట్లపై బాలయ్య ఎలా స్పందిస్తాడో.. అసలు స్పందిస్తాడో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: