ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణాలో... కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి అభిమానులు ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఆయన మాట్లాడే మాటలకు ఆయన చేసే విమర్శలకు కాస్త రెండు రాష్ట్రాల్లో కూడా ప్రాధాన్యత ఎక్కువ గానే ఉంటుంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్తో పాటు తెలంగాణ నాయకులను టార్గెట్ గా చేసుకుని రేవంత్ వేసే పంచ్లు మామూలుగా పేలవు. ఇక రేవంత్ టీడీపీలో ఉండగా ఆయనకు యూత్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ఆయన కాంగ్రెస్లోకి వెళ్లినా కూడా ఏపీలో ఉన్న తెలుగుదేశం నాయకులు, యువత కూడా రేవంత్ను ఓ రేంజ్లో అభిమానిస్తూ ఉంటుంది. అంతెందుకు గత అసెంబ్లీ ఎన్నికల్లో కొందరు ఏపీ తెలుగుదేశం యూత్ వింగ్ నాయకులు కొడంగల్ వెళ్లి మరీ రేవంత్ను గెలిపించాలని ప్రచారం చేశారు.
అయితే ఆ ఎన్నికల్లో రేవంత్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. పైగా రేవంత్ గెలుపుపై భారీ ఎత్తున పందేలు కూడా కట్టారు. అలాగే రేవంత్పై టీడీపీ ఏపీ నేతలు, యవకుల అభిమానం వరకు బాగానే ఉంది గాని ఇప్పుడు ఆయన మంత్రి కేటిఆర్ మీద విమర్శలు కాస్త ఎక్కువగా చేస్తున్నారు. ఈ విషయంలో ఇప్పుడు తెలంగాణా కాంగ్రెస్ కార్యకర్తల కంటే ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు ఎక్కువగా ప్రచారం చేయడం ఆశ్చర్యంగా మారింది. రేవంత్ మీద వస్తున్న ఆరోపణల విషయంలో వీళ్ళు ఎక్కువగా స్పందిస్తూ సోషల్ మీడియాలో కేసీఆర్ కి మొగుడు రేవంత్ అంటూ ఎవరికి తోచిన విధంగా వాళ్ళు కామెంట్ చేయడం షాకింగ్ న్యూసే.
అది అసలు టీడీపీకి అవసరం లేదు. దీనితో అక్కడి టీఆర్ఎస్ కార్యకర్తలు కొత్త నినాదం అందుకున్నారు. ఆంధ్రాతో కలిసి రేవంత్ కుట్ర చేస్తున్నాడు... రేవంత్కు తెలంగాణ కంటే ఆంధ్రా మీదే ప్రేమ ఎక్కువ అంటూ కౌంటర్లు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తల లక్ష్యంగా టీఆర్ఎస్ కార్యకర్తలు ఎక్కువుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. వీటికి కూడా సోషల్ మీడియాలో మంచి స్పందన రావడమే కాదు టీడీపీకి నష్టం కూడా జరుగుతోంది. ఏదేమైనా ఆంధ్రాలో పార్టీ పుట్టి మునుగుతుంటే ఇక్కడ చూసుకోకుండా టీడీపీ వాళ్లు అక్కడ రేవంత్ను హీరో చేయాలని చూస్తే ఇక్కడ టీడీపీ, అక్కడ రేవంత్ ఇద్దరూ మునిగిపోతారేమో చూసుకోండి ముందు..?