ప్రస్తుతం టాలీవుడ్లో రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ రాజకీయాల నేపథ్యంలోనే ఒకరిపై మరొకరు ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో విమర్శలు, సెటైర్లు వేసుకోవడంతో టాలీవుడ్ రాజకీయం కుతకుతలాడుతోంది. ఆంధ్రప్రదేశ్ లో సినిమాల షూటింగ్ కి సంబంధించి నిన్న సినీ ప్రముఖులు అందరూ వచ్చి సీఎం వైఎస్ జగన్ ని కలిసిన సంగతి తెలిసిందే. ప్రత్యేక విమానంలో వచ్చి సిఎం జగన్ ని కలిసి వెళ్ళారు. జగన్ను కలిసిన టాలీవుడ్ ప్రముఖులు కొన్ని కోరికలు కోరారు. ఈ కోరికలకు సిఎం నుంచి కూడా సానుకూలంగానే సమాధానం వచ్చింది.
అది పక్కన పెడితే ఇప్పుడు ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవి ఎక్కువగా బద్నాం అవుతున్నారు అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. సాధారణంగా చిరంజీవికి ఏపీలో కొన్ని కొన్ని వ్యాపారాలు ఉన్నాయి అని అంటూ ఉంటారు. ఆయనతో పాటుగా వచ్చిన నాగార్జున కూడా ఇక్కడ వ్యాపారాలు బాగానే చేస్తున్నారు. నాగార్జునకు అమరావతి నుంచి వైజాగ్ వరకు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయన్న టాక్ అయితే ఉంది.
ఇక రాజమౌళిని కాసేపు పక్కన పెడితే సురేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయనకు అటు తెలంగాణలోనూ.. ఇటు ఏపీలోనూ వందల కోట్ల రూపాయల థియేటర్లు, పంపిణీ వ్యాపారం ఉంది. ఇక ఇప్పుడు సిఎం జగన్ ని కలవడానికి వచ్చిన వారిలో చాలా మంది సొంత వ్యాపారాల కోసమే వచ్చారన్న విమర్శలు వస్తున్నాయి. ఇక చిరంజీవి అయితే విశాఖలో ఒక స్టూడియో ని ఓపెన్ చేసే ఆలోచనలో ఉన్నారు అని అంటున్నారు. అందుకే ఆయన జగన్ను కలిసే విషయంలో ప్రత్యేక చొరవ తీసుకున్నారని అంటున్నారు. విశాఖ స్టూడియో కోసమే చిరు, నాగ్ ఇద్దరూ వచ్చారు అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మరి నిజమా కాదా అనేది పక్కన పెడితే ఇందులో చిరంజీవిని ఎక్కువగా టార్గెట్ అవుతున్నారు అనేది అర్ధమవుతుంది. అటు తెలంగాణా సర్కార్ ని కూడా ముందు కలిసి౦ది ఆయనే కాబట్టి అక్కడ కూడా ఆయనే బద్నాం అయ్యారు అని మెగా అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో చిరంజీవి చొరవ తీసుకోవడం వరకు బాగానే ఉన్నా ఆయన మిగిలిన హీరోలను.. ఇండస్ట్రీ పెద్దలను అందరిని కలుపుకుని ముందుకు వెళ్లినా.. లేదా వారి నుంచి ఎలాంటి మాట రాకుండా ప్లాన్ చేసుకున్నా బాగానే ఉండేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.