ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏపీ సీఎం జగన్ తీసుకునే నిర్ణయాలు గాని.. అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలు గాని చాలా వరకు జాగ్రత్తలు తీసుకుని అడుగులు వెయ్యాల్సి ఉంది. రాష్ట్ర విభజన తర్వాత కేంద్రం గత ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వ హయాంలో గాని.. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన యేడాదిలో కాని కేంద్రం నుంచి ఏ మాత్రం సాయం అందలేదు అన్నది వాస్తవం. ఇక విభజన చట్టంలో పేర్కొన్న హామీలు కూడా అమలు కాకపోవడం ఏపీ ప్రజలు చేసుకున్న దురదృష్టం అనే చెప్పాలి. ఆర్ధికంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా వరకు ఇబ్బంది పడుతుంది అనే విషయం అందరికి స్పష్టంగా తెలుసు. ఎన్నికల హామీల అమలు విషయంలో జగన్ దూకుడు తగ్గించడం లేదు అని చెప్పవచ్చు.
ఈ యేడాది కాలంలోనే జగన్ ఇచ్చిన హామీలు కాకుండా అదనంగా మరో 40 హామీలను నెరవేర్చారు. ఆయన ఇచ్చిన 130 హామీలలో మరో 15-20 హామీలు మాత్రమే ఇంకా అమలు చేయాల్సి ఉంది. ఓ వైపు ఎంత ఆర్థిక లోటు ఉన్నా కూడా సంక్షేమ పథకాల అమలు విషయంలో జగన్ వెనక్కి తగ్గక పోవడమే జగన్ కి ఇబ్బందిగా మారే సూచనలు ఎక్కువగా ఉంటాయి అనేది రాజకీయ పరిశీలకులు చెప్తున్న మాట. కారణం ఏంటంటే రాబోయే రోజుల్లో కరోనా తీవ్రత చాలా అధికంగా ఉండే అవకాశం ఉంది. కరోనా వైరస్ ని కట్టడి చేయడం అనేది దాదాపుగా సాధ్యం అయ్యే పని కాదు. ప్రజలు బయటకు రావడానికి కూడా భయపడే రోజులు దగ్గరలో ఉన్నాయి.
కరోనా అనేది కంట్రోల్ కాకపోతే దేశ ఆర్ధిక వ్యవస్థ ఇంకా ఇబ్బంది పడుతుంది. ఈ క్రమంలోనే అసలే లోటు బడ్జెట్లో ఉన్న ఏపీకి మరిన్ని ఇబ్బందులు తప్పవు. ఈ టైంలోనే జగన్ జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. సంక్షేమ కార్యక్రమాల విషయంలో దూకుడు తగ్గించి ఇప్పుడు బయట మార్కెట్ నుంచి వస్తున్న అప్పులను చాలా జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఉద్యోగులకు జీతాలు ఇచ్చే విషయంలో ఇప్పుడు ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగులకు జీతాల్లో కోత విధించినా ఇచ్చే పెన్షన్ల విషయంలో కోత విధించినా సరే ప్రజల్లోకి ఇబ్బందికర సంకేతాలు వెళ్ళే అవకాశం ఉందని పలువురు జగన్ కి సూచిస్తున్నారు. మరి జగన్ ఏ నిర్ణయంతో ముందుకు వెళతారో ? చూడాలి.