తెలంగాణలో ఇప్పుడు కేసీఆర్ కి వచ్చిన ఇబ్బంది రాజకీయంగా అయితే ఏదీ లేదు అనే చెప్పాలి. రాజకీయంగా ఆయనను ఎదుర్కొనే శక్తి ఎవరికి లేదు అనే విషయం అందరికి స్పష్టంగా తెలుసు. కేసీఆర్ ఎప్పుడు అయితే తెలంగాణలో వరుసగా రెండోసారి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చారో అప్పటి నుంచి కేసీఆర్ తీసుకునే నిర్ణయాలకు.. పాలనలో ఆయన దూకుడుకు ఎదురు చెప్పే సాహసం కూడా ఎవ్వరూ చేయలేని పరిస్థితి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలుచుకున్న బీజేపీ ఒక్కసారిగా రెచ్చిపోయింది. మాకు తిరుగులేదన్నట్టుగా వ్యవహరించింది.
అయితే అంతలోనే జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఘోరమైన ఓటమితో పరువు పోగొట్టుకుంది. ఇక ప్రతిష్టాత్మకంగా జరిగిన హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి రెండు వేల ఓట్లు కూడా రాలేదు. దీనిని బట్టి అక్కడ క్షేత్రస్థాయిలో బీజేపీకి ఎంత మాత్రం పట్టులేదని అర్థమైంది. కేసీఆర్కు రాజకీయ ఇబ్బందులు లేకపోయినా సరే ఇప్పుడు కేసీఆర్ ని కోర్ట్ ల ద్వారా ఇబ్బంది పెట్టే విధంగా కరోనాను టార్గెట్ చేసుకుని బిజెపి అడుగులు వేస్తోంది అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి.
ప్రతీ జిల్లాలో కూడా కరోనా పరీక్షలకు సంబంధించి తెలంగాణా లో బిజెపి ఇప్పుడు హైకోర్ట్ కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కరోనా పరిక్షలు లక్షణాలు ఉన్న వారికి చేయడం లేదు అని హైకోర్ట్ లో బిజెపి పిటీషన్ వేసేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే క్షేత్ర స్థాయిలో బిజెపి తన కార్యకర్తల సహకారంతో ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సహకారం కూడా తీసుకుంటోందన్న చర్చలు కూడా వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్ సహకారంతో బిజెపి ఇప్పుడు మరింత దూకుడుగా ముందుకు వెళ్లి హైకోర్ట్ లో పిటీషన్ వేసి ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టుకు లాగి.. ఆ తప్పులను ప్రజల్లోకి తీసుకు వెళ్లే విధంగా ప్రయత్నాలు ప్రారంభించిందట. అందుకే కొద్ది రోజులుగా తెలంగాణ బీజేపీ నేతలు, ఆ పార్టీ జాతీయ నేతలు తెలంగాణలో కరోనా పరీక్షల విషయంలో అనేక రకాల విమర్శలు కూడా చేస్తున్నారు. ఏదేమైనా తాజా పరిణాల నేపథ్యంలో కేసీఆర్ ఇక్కడ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది అని రాజకీయ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.