ఏపీలో ప్రస్తుతం రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతోన్న సంగతి తెలిసిందే. ఓ వైపు విపక్ష తెలుగుదేశం పార్టీ నుంచి పలువురు కీలక నేతలు, మాజీ మంత్రులు పార్టీ మారేందుకు రెడీగా ఉన్నారు. ఇప్పటికే చాలా మంది పార్టీ మారిపోగా ఈ లిస్టులో ఎవ్వరూ ఊహించని పేర్లు కూడా ఉంటాయని అంటున్నారు. ఇదిలా ఉంటే వచ్చే నెలలో ఏపీ కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమవుతోన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. వాస్తవంగా కరోనా లేకపోయి ఉంటే ఇప్పటికే రాజ్యసభ ఎన్నికలు ముగిసి ఏపీ కేబినెట్ ప్రక్షాళన కూడా జరిగి ఉండేది. అయితే త్వరలోనే రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి.
ప్రస్తుతం జగన్ కేబినెట్లో మంత్రులుగా ఉన్న మోపిదేవి వెంకట రమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇద్దరూ కూడా రాజ్యసభకు ఎంపిక కావడం లాంఛనమే కానుంది. ఈ క్రమంలోనే ఈ ఇద్దరు మంత్రుల స్ధానంలో కొత్తవారిని తీసుకోవాలి. వీరితో పాటు మరో ఇద్దరు మంత్రులను కూడా జగన్ తన కేబినెట్ నుంచి తొలగించి వారి స్థానంలో మరో ఇద్దరికి చోటు ఇస్తారని టాక్.. ? ఇదిలా ఉంటే సీఎం జగన్ ఇద్దరు మంత్రులపై ఆగ్రహంగా ఉన్నారా...? అంటే అవుననే సమాధానం ఇప్పుడు వైసీపీ వర్గాల్లో వినపడుతుంది. ఇటీవల జరిగిన కొన్ని వ్యవహారాలూ ఇప్పుడు సిఎం జగన్ లో ఆగ్రహానికి కారణంగా మారింది అంటున్నారు. జగన్ ఆగ్రహంగా ఉన్నారని వార్తలు వస్తోన్న ఇద్దరు మంత్రులు కూడా రాయలసీమ జిల్లాలకు చెందిన వారే కావడం గమనార్హం. దీనితో ఇప్పుడు వారిని కేబినేట్ నుంచి తప్పించే అవకాశం ఉంది అని సమాచారం.
ఈ ఇద్దరు మంత్రుల్లో ఒకరు చిత్తూరు జిల్లాకు చెందిన ఒక మంత్రి అని... అలాగే దాని సరిహద్దున ఉన్న మరో జిల్లాలో కూడా మంత్రిని తప్పిస్తారని ప్రచారం జరుగుతోంది. వీరిలో ఒక మంత్రి తరచూ వివాదాల్లోకి వెళ్లడంతో పాటు భారీగా అవినీతికి పాల్పడడం... ఇతర నియోజకవర్గాల్లో వేలుపెట్టేసి సదరు ఎమ్మెల్యేలకు తీవ్ర ఇబ్బందిగా మారారన్న ఆరోపణలు అధిష్టానానికి తరచూ వెళుతున్నాయి. ఇక పొరుగున ఉన్న జిల్లాకు చెందిన మంత్రి అసలు ఇప్పటకీ శాఖలో ఏ మాత్రం పట్టు సాధించలేదట. దీనికి తోడు జిల్లాలో ఆయన వల్ల పార్టీ ఎదుగుదలకు ఉపయోగం లేదనే డిసైడ్ అయ్యి.. జగన్ ఆయన్ను తప్పించి మరో సామాజిక వర్గానికి మంత్రి పదవి కట్టబెట్టాలని చూస్తున్నారట. ఇక ఇద్దరు బీసీ మంత్రులు రాజ్యసభకు వెళుతుండడంతో ఇప్పుడు వీరి స్థానంలోనూ ఇద్దరు బీసీలకు ఛాన్స్ ఇస్తారని అంటున్నారు.