ఏపీలో విపక్ష తెలుగుదేశం పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు తన కుమారుడు సుధీర్తో సహా వైసీపీలోకి జంప్ చేసేశారు. ఆ వెంటనే మరో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఈఎస్ఐ స్కాంలో అరెస్టు అయ్యారు. ఇక ఆ మరుసటి రోజే మరో మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన తనయుడు అస్మిత్ రెడ్డి అరెస్టు అయ్యారు. అసలే బాబోరు వరుస షాకులతో ఉన్నారంటే ఇప్పుడు ఆయన మరింతగా ఆందోళన చెందే వార్తలు వస్తున్నాయి.
బాబోరికి అత్యంత సన్నిహితులు అయిన ముగ్గురు మాజీ మంత్రులు ఆయనకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ముగ్గురు మాజీ మంత్రులు ఎవరో కాదు.. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పొంగూరు నారాయణ, సుజయ్ కృష్ణ రంగారావు. వీరిలో నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి నారాయణ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన హడావిడి, హంగామా అంతా ఇంతా కాదు. సీఆర్డీయే చైర్మన్ గా కూడా ఉండడంతో ప్రతి విషయంలో బాబు కూడా నారాయణ మంత్రమే జపించేవారు. బాబు ఆయన ఎన్నికల్లో గెలవకపోయినా, రాజకీయ అనుభవం లేకపోయినా ఆయన్ను ఎమ్మెల్సీని చేసి మరి మంత్రిని చేశారు.
ఇక ఇప్పుడు వీరు పార్టీ ఓడిపోవడంతో సైలెంట్ అయిపోయారు. నారాయణ అసలు నియోజకవర్గాన్ని పట్టించకోవడం మానేయడంతోనే అక్కడ చంద్రబాబు మరో నేతకు బాధ్యతలు అప్పగించారు. నారాయణ వైసీపీలోకి వెళ్లడం దాదాపు ఖరారైందని అంటున్నారు. రేపో మాపో ముహూర్తం చూసుకునే ఆయన కండువా మార్చేయనున్నారట. ఇక బొబ్బిలిలో సుజయ్ చేతులు ఎత్తేయడంతో ఆయన సోదరుడు బేబీ నాయన ముందుండి పార్టీ పగ్గాలు నడిపిస్తున్నారు. ఇక బొబ్బిలి రాజులు గతంలో వైసీపీ నుంచే టీడీపీలోకి వచ్చారు. ఇప్పుడు వీరు తిరిగి టీడీపీలో ఉంటారా ? లేదా ? అన్న దానిపై సందేహాలు ముసురుకున్నాయి.
ఇక ఐదుసార్లు ఓడినా చంద్రబాబు సోమిరెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు. ఇక ఆయనకు నెల్లూరు జిల్లాలో మళ్లీ గెలిచే యోగ్యం లేదని అంటున్నారు. దీంతో తన వారసుడి రాజకీయ భవిష్యత్తు కోసం అయినా ఆయన పార్టీ మారక తప్పదని ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఏదేమైనా బాబోరికి వరుస షాకుల పరంపరలో ఈ మూడు షాకులు తగలనున్నాయనే అనుకోవాలి.