నిత్యం ప్రతిపక్ష నేతలపై విరుచుకుపడుతూ.. వారి అవినీతిని ఎత్తి చూపే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పై అవినీతి ఆరోపణలు తలెత్తుతున్నాయి. ఒక్క 108 వాహనాల టెండర్లలోనే 1,000 కోట్లకు పైగా అవినీతికి విజయసాయి పాల్పడ్డారని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఆయన విడుదల చేసిన లేఖలో పేర్కొన్న అంశాలు ప్రకారం 2018లో 108 అంబులెన్స్ల నిర్వహణ కాంట్రాక్టు భారత్ వికాస్ గ్రూపుకు ఐదేళ్లకు ఒక్కో అంబులెన్స్కి 1.31 లక్షలు కాంట్రాక్టుకి ఇచ్చారు. అయితే ఈ ఒప్పందం ఐదేళ్ల పాటు ఉంటుంది.
కానీ, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బిఏజి సంస్థతో చేసుకున్న ఆ ఒప్పందాన్ని రద్దు చేసింది. దీంతో వెంటనే అరబిందో ఫార్మా ఫౌండేషన్ కు ఈ కాంట్రాక్టును కట్టబెట్టింది. నెలకు 2.21 లక్షలు చెల్లిస్తామంటూ ఒప్పందం చేసుకుంది. ఇలా ఒక్కో వాహనంపై లక్షన్నర వరకు ఎక్కువగా చెల్లిస్తున్నారు. అంటే ఐదు ఏళ్లలో దాదాపు వెయ్యి కోట్లు అరబిందో ఫార్మా ఫౌండేషన్ కు జమ అవుతాయని కన్నా లక్ష్మీనారాయణ ఇప్పుడు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఈ అరబిందో ఫార్మా ఫౌండేషన్ లో విజయసాయి రెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి ఉన్నారు అంటూ కన్నా చెబుతున్నారు. తన అల్లుడికి దోచిపెట్టేందుకే విజయసాయి ఈ పని ఆరోపించారు. ప్రజాదనాన్ని కొల్లగొట్టి అల్లుడికి దోచిపెడుతున్నాడాని కన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలాగే ఈ కాంట్రాక్టు పై అనేక అనుమానాలు ఉన్నాయని, ఈ విషయంలో నిజాలు నిగ్గు తేల్చాలని అరబిందో చైర్మన్ రాంప్రసాద్ రెడ్డి పాత్రను కూడా నిగ్గు తేల్చాలని కన్నా లక్ష్మీనారాయణ ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు. మరి అవినీతి నిర్మూలనే ధ్యేయంగా అడుగులేస్తానని చెప్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీనిపై స్పందిస్తాడా..? దీనిలోని నిజాలను నిగ్గు తేలుస్తారా..? ఆరోపణ నిజమైతే విజయసాయిపై చర్యలు తీసుకుంటారా..? అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. మరోపక్క ఇదంతా సీఎం జగన్ కి తెలియకుండానే జరుగుతుందా అంటూ కొందరు సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేస్తున్నారు.