ఏపీ రాజకీయం ఎప్పుడు ఎలా ? మారుతుందో ? కూడా ఊహించలేక పోతున్నాం. గత ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీని చిత్తు చిత్తుగా ఓడించిన వైసీపీ అధికారంలోకి వచ్చి యేడాది అవుతోంది. అయితే ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏపీలో పాగా వేసేందుకు, పట్టుకోసం కాచుకుని కూర్చొని ఉంది. టీడీపీలో కలిసి ఉంటే అధికారంలోకి రాలేమని నిర్ణయించుకున్న బీజేపీ ఆ పార్టీతో ఎన్నికలకు యేడాది ముందే తెగతెంపులు చేసుకుంది. ఇక ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చిన యేడాదికి తమ ఆపరేషన్ స్టార్ట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. వైసీపీ సర్కార్లోని లోపాలను ఎత్తిచూపుతూ బీజేపీ ఉద్యమాలు కూడా చేస్తూ వస్తోంది. మరో వైపు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సైతం జగన్ సర్కార్ తీరును తీవ్రంగా ఎండగడుతున్నారు.
ఇక ప్రస్తుత వైసీపీ విధానాలు ఎండగట్టే క్రమంలో బీజేపీ చేపట్టిన ఆందోళనలు సైతం టీడీపీకి ఎంతో కొంత ప్లస్ అవుతున్నాయన్నది మాత్రం వాస్తవం. ఈ విషయాన్ని గ్రహించిన బీజేపీ టీడీపీతో పరోక్షంగా మిలాఖత్ అవుతున్నట్టే కనిపిస్తోంది. అయితే ఇక్కడే బీజేపీ ట్విస్ట్ ఇస్తోంది. ఓ వైపు టీడీపీ సహకారం తీసుకుంటూనే మరోవైపు టీడీపీని వైసీపీతో వ్యూహాత్మకంగా బలహీనం చేయిస్తోంది. టీడీపీకి చెందిన పలువురు సీనియర్లు, మాజీ మంత్రులు వైసీపీలోకి వెళ్లిపోతున్నారు. ఇలా జరగాలనే బీజేపీ కూడా కోరుకుంటోంది. వ్యూహాత్మకంగానే టీడీపీని బద్నాం చేయడం ద్వారా టీడీపీని వీక్ చేసి తమ చెప్పు చేతల్లోకి తెచ్చుకోవడం లేదా ఆ ప్లేస్లోకి తాము రావాలన్నదే బీజేపీ ప్లాన్.
అయితే ఇక్కడే బీజేపీలో క్రమశిక్షణ కట్టు తప్పుతోంది. అధికార వైసీపీకి అనుకూలంగా మాట్లాడే వాళ్లు ఒక వర్గం గాను, టీడీపీకి సానుకూలంగా మాట్లాడే వాళ్లు మరో వర్గం గాను తయారయ్యారు. బీజేపీ ఎంత తెలివిగా వ్యవహరిస్తోందంటే ఓ వైపు గతంలో టీడీపీ ప్రభుత్వం లో ఆ పార్టీ నేతలు చేసిన అవినీతిపై ఇప్పటి ప్రభుత్వం తీసుకుంటోన్న చర్యలను ఓ వైపు సమర్థిస్తూనే మరో వైపు వైసీపీ ప్రభుత్వం తీసుకుంటోన్న చర్యలపై పోరాటాలు చేస్తోంది. ఓవరాల్గా చూస్తే బీజేపీ తెలుగుదేశం విషయంలోనే కఠినంగా వ్యవహరిస్తోంది. అదే టైంలో వైసీపీని కూడా వదిలేది లేదన్నట్టుగా వ్యవహరిస్తోంది.
ఈ క్రమంలోనే ఏపీలో వైసీపీ నేతలు కూడా బీజేపీని, కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీని విమర్శించేందుకు సాహసించడం లేదు. మరో వైపు వైసీపీలో అసమ్మతి ఎంపీ రఘురామ కృష్ణం రాజు వెనక బీజేపీ ఉందన్న టాక్ ఉంది. ఆయన బీజేపీలోకి వెళ్లే ఆలోచనలో ఉన్నారన్న ప్రచారం కూడా వైసీపీ వర్గాల్లోనే వినిపిస్తోంది. ఏదేమైనా ఏపీలో అధికారం కోసం డైరెక్టుగా ఎదగలేని బీజేపీ ఇలా టీడీపీ, వైసీపీ లూప్ హోల్స్తో కొత్త రాజకీయం చేస్తోంది.