చైనాకు భారత ప్రభుత్వం మరో భారీ ఝలక్ ఇచ్చింది. ఇప్పటికే అనేక విధాలుగా ఆంక్షలతో భారత్లో చైనా వ్యాపార సామ్రాజ్యానికి చెక్ పెడుతూ వస్తున్న విషయం తెలిసిందే. 59 ఆప్ల నిషేధంతో చైనాకు వారం రోజులు కూడా గడవకముందే దాదాపు రూ.లక్ష కోట్ల నష్టం వాటిల్లినట్లు సమాచారం. అంతేకాక భవిష్యత్లో భారత్లో పెట్టుబడులు పెట్టిన చైనా దేశానికి చెందిన సంస్థల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. చేతులేత్తేసిన అనేక సంస్థలు తట్టాబుట్ట సర్దేసుకోవడమో లేక..భారత పెట్టుబడుదారులకు అమ్మేసుకోవడం జరుగుతోంది. ఇక చిన్నా చితక వ్యాపార సంస్థలు చైనా బ్రాండ్ ఇమేజ్ లేకుండా జాగ్రత్త పడటం మొదలుపెట్టేశాయి. చైనా బజార్లన్నీ కూడా రాత్రికి రాత్రే భారత్ బజార్లుగా మారిపోవడం గమనార్హం.
చైనాతో తాడోపేడో తేల్చుకునేందుకు భారత ప్రధాని ఏకంగా శుక్రవారం ఉదయం లద్దాఖ్లో పర్యటించి సంచలనం సృష్టించారు. బెదిరింపులకు భారత్ భయపడదని చైనాకు స్పష్టం చేయడం గమనార్హం. అదే కోవలో డ్రాగన్కు చుక్కలు చూపేందుకు పక్కా మ్యాప్ గీసుకుని మరీ మోదీ ఆడటం మొదలు పెట్టేశారు. చైనాను కట్టడి చేయడంలో భాగంగా మరో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర మంత్రి రాజ్ కుమార్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా, పాకిస్తాన్ నుంచి విద్యుత్ రంగంలో అవసరమున్న పరికరాలను దిగుమతి చేసుకోవద్దని సూచించారు. విద్యుత్ రంగ దిగుమతులపై కేంద్ర ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా చైనా నుంచి దిగుమతి చేసుకోరాదని తెలిపారు.
అటువంటి దిగుమతులను ట్రోజన్ హార్స్ లేదా మాల్వేర్గా ఉపయోగించుకుని పవర్ గ్రిడ్లను షట్డౌన్ చేసే ప్రమాదమున్నదని హెచ్చరించారు. అంతేకాక ఆ దేశాల వస్తువల దిగుమతితో అక్కడ మాత్రమే ఉద్యోగాల కల్పన జరుగుతున్నదని… మన దేశంలో కాదని ఆయన గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో చైనా, పాకిస్తాన్ దేశాల దిగుమతులకు “అనుమతి” పొందాల్సిన జాబితాలో చేర్చినట్లు ఆర్కే సింగ్ తెలిపారు. ప్రస్తుతం దేశీయ విద్యుత్తు వ్యవస్థకు అవసరమైన అన్నింటినీ మనం సొంతంగా తయారు చేసుకొంటున్నామని…. మన దేశానికి ఆ శక్తి, సామర్థ్యాలు ఉన్నాయన్నారు. విద్యుత్తు పరికరాల కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు.