కరోనాతో భూమండలంపై దాదాపు అన్ని దేశాలు ఆగమాగమవుతుంటే..ప్రపంచపటంలోని ఒక దేశం మాత్రం కరోనా తాకిడి లేక నిబ్బరంగా ఉంది. విమర్శలు చేసిన నేతలే ఇప్పుడు ఆ దేశ అధ్యక్షుడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎంతో ముందు జాగ్రత్తగా వ్యవహరించిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ను ప్రపంచ దేశాల అధ్యక్షులు కిమ్ ఈజ్ గ్రేట్ అంటూ కొనియాడుతున్నారు. ఇక అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కరోనాపై వెటకారపు మాటలు మాట్లాడి బొక్కాబొర్లపడి అగ్రరాజ్యాన్ని కరోనాలోనూ అగ్రస్థానంలో నిలిపేశాడు. గతంలో ఉత్తర కొరియా చిన్న దేశమని, అమెరికా అధ్యక్షుడి హోదాలో ఉండి ఆలోచించడం కూడా టైం వేస్ అంటూ అవాకులు..చెవాకులు పేలిన విషయం తెలిసిందే.
ఇప్పుడు ట్రంప్కు ఆయన చేసిన వ్యాఖ్యలనే కొంతమంది అమెరికన్లు గుర్తు చేస్తూ కిమ్ ముందు చూపును కొనియాడుతున్నారట. ఇక ఉత్తర కొరియా విషయానికి వస్తే ఈ దేశంలో ఇప్పటి వరకు ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. ఇదే విషయాన్ని ఆ దేశ అధినేత కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా ప్రకటించారు. అన్ని దేశాలూ ఎప్పటికప్పుడు తమ దగ్గర నమోదవుతోన్న కేసుల వివరాలను, వైరస్ మారుతోన్న తీరును అంతర్జాతీయ సమాజంతో పంచుకుంటున్నది... ఒక్క ఉత్తరకొరియా తప్ప. కరోనా విలయ కాలంలో అక్కడేం జరుగుతున్నదోననే అనుమానాలకు తెరదించుతూ అధినేత కిమ్ జాంగ్ ఉన్ సంచలన ప్రకటన చేశారు.
చైనా, దక్షిణ కొరియాలో కోవిడ్ 19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా సరిహద్దులు బ్యాన్ చేశామని, లక్షణాలు ఉన్న వారిని ఐసోలేషన్కు పంపించామని కిమ్ తెలిపాడు. అయితే కరోనావైరస్ వల్ల ప్రమాదం ఇప్పటికీ పొంచి ఉంది అని... ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలి అని సూచించాడు. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్న వైరస్ ఉత్తర కొరియాను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తుంది అని కిమ్ హెచ్చరించాడు. కరోనా వైరస్ వ్యాప్తిని ముందే పసిగట్టిన కిమ్ జాంగ్.. జనవరి 30 నుంచే దేశవ్యాప్త లాక్ డౌన్ విధించారు. గత నెల నెల 19 నాటికి 922 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తే ఒక్క పాజిటివ్ కేసు బయటపడలేదని చెప్పేశారు. ఇదే విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఉత్తర కొరియా ఆరోగ్యశాఖ తెలిపింది.