గడిచిన కొద్దిరోజులుగా తెలంగాణలో ప్రతీ రోజూ 1800ల పైనే కరోనా కేసులు నమోదవుతూ వస్తున్నాయి. హైదరాబాద్లో పాజిటివ్ కేసుల నమోదు సంఖ్యను చూస్తేనే వణుకుపుడుతోంది.. అయితే.. ఢిల్లీ, ముంబై, చెన్నైతో పాటు హైదరాబాద్ కూడా డేంజర్ జోన్లో ఉన్నాయి. ఆ రాష్ట్రాలకు మనకు తేడా ఒక్కటే అక్కడ ఎక్కువ నుంచి తక్కువకు కేసుల గమనం ఉంది. అంటే గతంలో కేసుల సంఖ్య ఎక్కువగా ఉండేది క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ విషయంలో ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు మంచి ఫలితాలిచ్చాయనే చెప్పాలి. గతంలో అక్కడా రోజూ 3800ల వరకు కొత్తగా కేసులు నమోదవుతూ ఉండేవి. అయితే వారం రోజులుగా అక్కడ గణనీయంగా 2100లోపే కేసులు నమోదవుతున్నాయి.
మిగతా రాష్ట్రాలైనా తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్రల్లో కూడా మెరుగైన పరిస్థితే కనిపిస్తోంది. తెలంగాణ విషయానికి వస్తే నెల క్రితం వరకు పరిస్థితి అదుపులోనే ఉందని అంతా అనుకున్నారు. అనుహ్యంగా గత పదిహేను రోజులుగా 1000కి పైగా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోనే కేసులు నమోదవుతున్నాయని అధికారులు మొన్నటి వరకు పల్లవి వినిపించినా ఇప్పుడు కరోనా తెలంగాణ పల్లెలను కూడా తాకింది. పల్లె,పట్నం తేడాలేదు. అంతా కరోనా మయంగా మారుతోంది. ప్రతీ జిల్లాలో 100 నుంచి 300 కేసులకు పైబడే ఉండటం గమనార్హం. వ్యాధి బారిన పడుతున్నవారిలో పోలీసులు, వైద్యులు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
మొత్తంగా తెలంగాణ కరోనా కేసుల సంఖ్య 30వేలకు చేరువైంది. రోజురోజుకు కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో 1,924 కేసులు నమోదు కాగా, హైదరాబాద్ పరిధిలోనే 1,590 కేసులు వచ్చాయి. ఇవాళ 11మంది చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 324కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 29,536 మందికి కరోనా సోకగా 11,933 యాక్టివ్ కేసులు ఉన్నాయి. చికిత్స తీసుకొని 17,279 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇవాళ రంగారెడ్డి జిల్లాలో 99, మేడ్చల్ జిల్లాలో 43, సంగారెడ్డి జిల్లాలో 20 కేసులు, వరంగల్ రూరల్ 26, నిజామాబాద్ 19, మహబూబ్నగర్ 15, కరీంనగర్ 14, వనపర్తి 9, సూర్యాపేట జిల్లాలో 7 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.