ఇఫ్పటికిప్పుడు తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలు వచ్చేయాలి. అర్జంటుగా వైసీపీ అభ్యర్ధిని ఓడించి తెలుగుదేశంపార్టీ అభ్యర్ధి గెలిచిపోవాలి. అన్నీకూడా ఇంత అర్జంటు అర్జంటుగా ఎందుకు జరిగిపోవాలంటే జనాల్లో జగన్మోహన్ రెడ్డి మీద విపరీతమైన వ్యతరేకత ఉందని నిరూపితమవ్వాలి. ఎంతసేపు ఇదో గోల చంద్రబాబుకు. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటివరకు జనాలు మోసపోయి వైసీపీకి ఓట్లేశారు. జగన్ కు జనాలను మోసం చేసి ఓట్లేయించుకున్నారంటూ ఇప్పటికి కనీసం ఓ వెయ్యిసార్లయినా గోల పెట్టుంటారు. మరి వైసీపీకి అధికారం దక్కిన విషయంలో చంద్రబాబు చెబుతున్నది నిజమేనా ? ఎలా నిజమవుతుంది ? 2014లో చంద్రబాబు ఇచ్చిన హామీలేమిటి ? అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పరిపాలన ఏమిటి ? అనేది జనాలకు బాగా అర్ధమైంది. ఇందుకే మొన్నటి ఎన్నికల్లో టీడీపీకి జనాలు కర్రకాల్చి వాతపెట్టారు. దాన్నే చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు.




ఇక ప్రస్తుతానికి వస్తే ఇప్పటికిప్పుడు తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో టీడీపీకి గెలిచేంత సీన్ లేదని ఎవరినడిగినా చెప్పేస్తారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి అమలు చేస్తున్న సంక్షేమపథకాల వల్ల జగన్ అంటే జనాల్లో సానుకూలత ఉంది. ఇపుడు జనాల్లో కనిపిస్తున్న వ్యతిరేకతంతా చంద్రబాబు ఆరోపణల్లోను, ఎల్లోమీడియాలో మాత్రమే. ఎక్కడైనా స్ధానిక నేతల మీద జనాల్లో వ్యతిరేకత ఉంటే ఉండచ్చు. అదేమీ తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక గెలుపుపై ప్రభావం చూపే అవకాశం లేదు. మరి ఈ పరిస్ధితుల్లో చంద్రబాబు ఆరాటం అంతా ఎందుకు ? తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో టీడీపీ గెలిచిపోవాలని చంద్రబాబు ఎందుకింత హడావుడి చేస్తున్నట్లు ? ఎందుకంటే టీడీపీ ఎక్కడ మూడోస్ధానంలోకి పడిపోతుందో అనే భయమే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీని పట్టి కుదిపేస్తోంది.




తిరుపతి ఉపఎన్నికలో ఓడిపోయినా పర్వాలేదు కానీ మూడోస్ధానానికి పడిపోతే మాత్రం పరిస్ధితి చాలా ఘోరంగా ఉంటుంది. మొన్నటి ఎన్నికలో టీడీపీ అభ్యర్ధి పనబాక లక్ష్మిపైన వైసీపీ దివంగత ఎంపి బల్లిదుర్గాప్రసాదరావుకు 2.28 లక్షల ఓట్ల మెజారిటి వచ్చింది. ప్రతిపక్షంలో ఉన్నపుడే అంత మెజారిటి వస్తే అధికారంలో ఉన్నపుడు జరుగుతున్న ఉపఎన్నికలో ఇంకెంత మెజారిటి రావాలి ? అన్నదే జగన్ భావనగా ఉందని వైసీపీ నేతలంటున్నారు. సరే జగన్, చంద్రబాబు వాదనను పక్కనపెట్టేద్దాం. వైసీపీ ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత ఉండటానికి అవకాశం కూడా పెద్దగా కనబడటం లేదు. జగన్ ప్రభుత్వంపై జనాలందరు వ్యతిరేకమైపోయారనే భ్రమల్లో చంద్రబాబు ఉన్నారంతే. ఆయన్ను భ్రమల్లో ముంచటానికి ఎలాగూ ఎల్లోమీడియా ప్రత్యేకమైన వార్తలను వండివారుస్తోంది. కాబట్టి దాన్నే నిజమనుకుని చంద్రబాబు ప్రతిరోజు గోల చేస్తున్నారు. మరి రేపు జనాలు వైసీపీని మంచి మెజారిటితో గెలిపిస్తే చంద్రబాబు ఏమైపోతారో పాపం.

మరింత సమాచారం తెలుసుకోండి: