ప్రస్తుతం ప్రజాప్రతినిధి అనే పదానికి అర్ధం చాలా మారిపాయింది. ఒక్కసారి ప్రజాప్రతినిధిగా గెలిస్తే చాలు... ఏకంగా తరతరాలు కూర్చొని తినేలా సంపదించొచ్చు అనేలా మారిపాయింది. అలాంటిది అతను ఒకసారి కాదు రెండుసార్లు కాదు ఏకంగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ సొంత ఇల్లు కూడా సంపాదించుకోలేని నిస్వార్ధమైన అసలు సిసలు నిఖార్సైన కమ్యూనిస్ట్ నాయకుడు కాదు కాదు పోరాట యోధుడు పాటూరు రామయ్య గారు. కృష్ణా జిల్లా నిడుమోలు (ప్రస్తుతం పామర్రు) నియోజకవర్గానికి నాలుగు సార్లు శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ప్రజాశక్తి పత్రికకు సంపాదకులుగా పనిచేశారు.అలాంటి కమ్యునిస్టు పోరాట నాయకుడు పాటూరు రామయ్య తన జీవిత చరమాంకంలో ఇబ్బందులు పడుతుండడం అందరినీ కలచివేస్తోంది.



తాజాగా పేద ప్రజలకు జగన్ సర్కార్ ఇస్తున్న ఒక సెంటు నివాస స్థలాన్ని తనకు కూడా కేటాయిస్తే, గుడిసె వేసుకుని జీవిత చరమాంకంలో రాష్ట్రంలోనే ఉండిపోతానని పాటూరు రామయ్య చెబుతున్నారు. ఇక అతని వ్యక్తిగత వివరాల్లోకి వెళితే... పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని జలదంకి మండలం, జమ్మలపాలెంలో అత్యంత నిరుపేద దళిత కుటుంబంలో పాటూరు వెంకయ్య, సుబ్బమ్మ దంపతులకు 1941 అక్టోబర్ 9న పాటూరు రామయ్య జన్మించారు. బతుకుదెరువు కోసం కూలిపనులకు వెళ్లేవారు. దాతల సహకారంతో చదువు సాగించారు. విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటూ పుచ్చలపల్లి సుందరయ్య శిష్యుడిగా పేరుపొందారు. 1965లో మహాలక్ష్మిని వివాహం చేసుకున్నాడు. తన ప్రజా సేవకు అడ్డొస్తారని భార్య అనుమతితో బిడ్డలనే వద్దనుకుని కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకున్నారు. తర్వాత కృష్ణా జిల్లా నిడుమోలు నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు సీపీఎం తరుఫున రామయ్య శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. 1985, 1989, 1994, 2004లో నిడుమోలు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే తన నియోజకవర్గంలో కొన్ని వేల మందికి ఇంటి స్థలాలు కల్పించి నిలువ నీడ కల్పించారు. శాసనసభలో రామయ్య చేసిన ప్రసంగాలు ఎంతగానో ఆకట్టుకునేవి. ఆయన హయాంలోనే లక్ష్మీపురం షుగర్‌ ఫ్యాక్టరీ మిగులు భూమిని 7,500 మంది పేదలకు ఒక్కొక్కరికి 20 సెంట్ల నుంచి 25 సెంట్లు చొప్పున ఆయా గ్రామాల్లో పంపిణీ చేశారు. అలాంటి ఆయన తనకంటూ ఒక్క సెంటు స్థలాన్ని నివసించేందుకు కూడా సంపాదించుకోలేదు.



ఎన్నికల్లో ధన ప్రవాహం పెరగడం, వయసు మీద పడటంతో ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఇన్నాళ్లూ ఆయన పెంచుకున్న కూతురు వద్దే ఉంటున్నారు. అయితే ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా ఆయన చల్లపల్లి సమీపంలోని చింతలమడ వెళ్లారు. పాటూరు రామయ్య రాక విషయం తెలిసిన పలువురు నాయకులు ఆయన్ను కలుసుకుని ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. 80 ఏళ్ల వయసులో సొంత ఆస్తులు లేక ఉండడానికి ఇల్లు లేక ఆయన ఇబ్బంది పడుతున్నట్టు తెలిసి ఆవేదనకు గురయ్యారు. ఇన్నాళ్లూ ఆయన పెంచుకున్న కూతురు వద్దే ఉంటున్నా.. శేష జీవితాన్ని కృష్ణా జిల్లాలోని చల్లపల్లి లేదా మచిలీపట్నంలో గడపాలని కోరుకుంటున్నారు. ప్రభుత్వం తనకు ఇంటి స్థలం మంజూరు చేస్తే అక్కడే చిన్న గుడిసె వేసుకుని ఉంటానంటున్నారు. రామయ్య లాంటి నిస్వార్థ నేత ఉన్న కాలంలో తాము కూడా జీవించి ఉన్నందుకు గర్వపడుతున్నామని, అలాంటి నాయకుడిని గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: