ఇదిలా ఉండగా ఇలాంటి ఆపత్కాలంలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్ర ప్రతినిధులుగా కీలక పాత్ర పోషించాల్సిన రాష్ట్ర బీజేపీ నేతలు ఎక్కడా కానరాకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. కరోనా సంక్షోభంలో ప్రజల స్థైర్యం దెబ్బతినకుండా అందుబాటులో ఉండటం గాని, కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి అందాల్సిన సాయానికి సంబంధించి కనీస ప్రయత్నం చేస్తున్నట్టుగానీ ఎక్కడా కనబడటంలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏవైనా ఎన్నికలొస్తే చాలు..ఇక రాష్ట్ర రాజకీయాల్లో తమదే ప్రధాన పాత్ర అని, భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేది తామేనని భారీ ఉపన్యాసాలిచ్చే నాయకులెవరూ ప్రస్తుతం పత్తా లేరు.
తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల సమయంలో కేంద్రం నుండి అది తెప్పిస్తామని, ఇది తెప్పిస్తామని ఈ నేతలు బోలెడు హామీలిచ్చారు. నిజానికి ఇలాంటి సంక్షోభ సమయంలో ప్రజలకు అండగా నిలిస్తే ఆ పార్టీ పట్ల ఆదరణ పెరిగే అవకాశముంది కూడా. కేంద్రాన్ని మెప్పించి, ఒప్పించి అవసరమైన మేరకు టీకాలు, ఆక్సిజన్ తెప్పించవచ్చు. ఇతర రాష్ట్రాల బీజేపీ నేతలు ఈ విధంగా కృషి చేస్తున్నట్టు వార్తలు వస్తున్నా మన రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం గడప దాటి బయటకు రావడం లేదు. ఇక టీవీ డిబేట్లలో ఊదరగొట్టే బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు, రాష్ట్ర నేత విష్ణువర్ధన్రెడ్డి వంటి నాయకులు అప్పడప్పుడూ ట్విట్టర్లో రాజకీయ ప్రకటనలకే పరిమితమవుతున్నారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి వంటివారు ఏమిచేస్తున్నారో ఎవరికీ తెలియని పరిస్థితి. మరి ఆ పార్టీ పట్ల ప్రజల్లో ఏవిధంగా నమ్మకం ఏర్పడుతుందో ఆ దేవుడికి మాత్రమే తెలియాలని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.