ప్రస్తుతం ఏపీలో ఆంధ్రప్రదేశ్లో వ్యాక్సిన్ నిల్వలు మరీ తక్కువగా ఉన్నాయి. కొత్త వాళ్లకు తొలి డోస్ వేయడం సంగతలా ఉంచితే.. ఇప్పటికే ఫస్ట్ డోస్ వేసుకుని, సెకండ్ డోస్ వేసుకోవాల్సిన గడువు రావడంతో టీకా కేంద్రాలకు వెళ్తుంటే నో స్టాక్ బోర్డులే కనిపిస్తున్నాయి. దీనిపై సహజంగానే విపక్ష టీడీపీ..ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది. ఐతే ఈ విషయంలో తమ వైఫల్యం ఏమీ లేదంటూ వైసీపీ సర్కారు ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ కేంద్రానిదే భారమని తేల్చింది. అయితే అక్కడితో ఊరుకోకుండా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడి మీద, మరో ప్రముఖ మీడియా సంస్థ అధినేత మీద ఆరోపణలు చేస్తూ వ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ యాజమాన్యంతో వారికి సంబంధ, బాంధవ్యాలు ఉన్నాయిని, కోవాగ్జిన్ నిల్వలు ఏపీకి రాకుండా వారు అడ్డుకుంటున్నారన్న అర్థం వచ్చేలా ప్రభుత్వాధినేత స్వయంగా ఆరోపణలు చేశారు.
దీంతో ఉరుమురిమి మంగళం మీద పడినట్టు రాజకీయ విమర్శలకు తాము కేంద్రంగా మారడంతో భారత్ బయోటెక్ యాజమాన్యం తప్పనిసరి పరిస్థితిలో స్పందించింది. సంక్షోభ సమయంలో ప్రజలను ఆదుకునేందుకు శక్తికి మించి వ్యాక్సిన్ తయారీకి కృషి చేస్తున్న తమపై దుష్ప్రచారం భావ్యం కాదంటూ.. సంస్థ అధినేతల్లో ఒకరైన "సుచిత్ర ఎల్లా" స్పందించారు. నేరుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేరు ఎత్తకుండా.. పరోక్షంగానే తమకు దురుద్దేశాలు ఆపాదించడం పట్ల ఆమె విచారం వ్యక్తం చేశారు. ఈ నెల 10న ప్రయారిటీ ప్రకారం ఆంధ్రప్రదేశ్ సహా 18 రాష్ట్రాలకు కోవాగ్జిన్ డోసులను పంపామని.. అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ డోసులను బట్టి చిన్న చిన్న షిప్మెంట్లే పంపించామని.. తమపై రాజకీయ విమర్శలు చేయడం చాలా బాధిస్తోందని ఆమె తెలిపారు. తమ సిబ్బందిలో కూడా 50 మంది దాకా కరోనా బారిన పడ్డారని.. అయినా వెరవకుండా ఉద్యోగుల సహకారంతో వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచే ప్రయత్నం చేస్తున్నామని ఆమె ట్విట్టర్లో వివరించారు. మరోవైపు సంస్థ మరో అధినేత "కృష్ణా ఎల్లా" వ్యాక్సిన్ డోసులకు సంబంధించి తమకు లేఖ రాసిన ఢిల్లీ ప్రభుత్వానికి జవాబు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగానే రాష్ట్రాలకు వ్యాక్సిన్ డోసులు పంపుతున్నామని అందులో ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కష్టకాలంలో ఔషధ తయారీ సంస్థలపైనా రాజకీయ ఆరోపణలు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.