అయితే ఊహించనివిధంగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నట్టు సమాచారం. ఇందుకు కారణం ఏడాది కాలంగా దేశాన్ని కమ్ముకుని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి. గత ఏడాది వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా కేంద్రం విధించిన కఠిన లాక్డౌన్ అన్నిరంగాలనూ తీవ్రంగా దెబ్బతీసింది. పలు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థల నడ్డి విరిచింది. తెలంగాణ కూడా దీనికి అతీతం కాదు. ఇప్పుడు మరోసారి వైరస్ తీవ్రత నేపథ్యంలో రాష్ట్రంలో మరలా లాక్డౌన్ పెట్టక తప్పలేదు. అంటే తాత్కాలికంగానైనా వ్యాపారాలు నిలిచిపోవడంతో రాష్ట్రానికి వచ్చే పన్నుల ఆదాయానికి భారీగా గండి పడక తప్పదన్నమాట. ఈ నేపథ్యంలోనే పెరిగిన ఖర్చులు, పూర్తిగా ఆగిన రాబడితో భవిష్యత్తు అవసరాలు ఎలా తీర్చుకోవాలన్న అంచనాలతో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రస్తుతం తలపట్టుకుంటోంది. కోవిడ్ ప్రభావం త్వరగా నియంత్రణలోకి రాని పక్షంలో జూన్ నెలలో ఎలా నెట్టుకురావాలన్న ఆందోళన ప్రభుత్వ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. ఇప్పటికే రాబడి వచ్చే శాఖలపై లాక్డౌన్ ప్రభావం తీవ్రంగా పడింది. అప్పులు, బాండ్ల విక్రయాల ద్వారా వచ్చే నిధులు తప్ప ఖజానాకు రాబడి కనిపించడం లేదు.
ఈ నేపథ్యంలో ఈ నెల చెల్లించాల్సిన వేతనాలు రూ. 3,500 కోట్లు, వడ్డీ చెల్లింపులు రూ. 1150 కోట్లు, రుణాలు తీర్చేందుకు రూ. 1,300 కోట్లు, ఆసరా పింఛన్లకు రూ. 1,000 కోట్లు, ఉచిత బియ్యం కోసం 1,120 కోట్లు, స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన 500 కోట్లు, ఇతర నిర్వహణ వ్యయాలు, కోవిడ్ నియంత్రణ చర్యల కోసం ఖర్చులు వంటివన్నీ కలిపితే సుమారు రూ.12 వేల కోట్లు అవసరమవుతాయని ఆర్థిక శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో కేంద్రం నుంచి అందే సాయం అంతంతమాత్రమే కావడంతో ప్రభుత్వం నిధుల సమీకరణకు కసరత్తులు మొదలుపెట్టింది. బాండ్ల విక్రయం ద్వారా రూ. 1,000 కోట్లు, కేంద్ర నుంచి రావాల్సిన పన్నుల వాటా రూ. 1,400 కోట్లను సమీకరించుకుని ఈ పరిస్థితిని అధిగమించే ప్రయత్నాలు చేస్తోంది. మొత్తం మీద కరోనా వైరస్ పంజా విసరడంతో సంపన్న రాష్ట్రమైన తెలంగాణకు కూడా ఏపీ మాదిరే ఆర్థిక కష్టాలు తప్పడం లేదన్నమాట.