ఇదే సమయంలో ప్రభుత్వంపై రఘురామరాజు చేస్తున్న పోరాటానికి సహజంగానే ప్రతిపక్షాల నుంచి మద్దతు లభించింది. ఇది వైసీపీ ప్రభుత్వానికి పుండు మీద కారం చల్లినట్టైంది. దీంతో రాజు ప్రతిపక్షాలతో చేతులు కలిపి, కుట్రపూరితంగా అసత్యాలు, అర్థసత్యాలు ప్రచారం చేస్తూ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నానికి పాల్పడుతున్నారంటూ ఆయనపై రాజద్రోహం, కులాల మధ్య విభేదాలు సృష్టించడం వంటి పలు కేసులు నమోదు చేసింది. ఇందుకు సాక్యాలుగా రఘురామకృష్ణంరాజు కొంతకాలంగా చేస్తూ వచ్చిన రచ్చబండ కార్యక్రమాల వీడియోలను చూపిస్తోంది. వీటిని చూస్తే ఎవరికైనా రాజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారని అనిపించక మానదు. అయితే రాచరికం, బ్రిటిష్ కాలంనాటి రాజద్రోహం కేసును ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధిపై పెట్టడమేమిటన్నది ప్రతిపక్షాల వాదనగా ఉంది.ఈ ఘటనలో రాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారనే ఆరోపణలను ఆయన కుటుంబం వ్యక్తం చేస్తోంది. ఇది నిజమని తేలితే ఏపీ సీఐడి కోర్టు ముందు సమాధానం చెప్పుకోక తప్పదు.
దీనికీ సత్యం రామలింగరాజు ఉదంతానికీ సంబంధం ఏముంది..?
ఇక ఈ సందర్భంగా సత్యం రామలింగరాజు ఉదంతాన్ని పలువురు తెరపైకి తెస్తున్నారు. ఇది కూడా అసంబద్ధమైన విషయం. రామలింగరాజు స్థాపించిన సత్యం కంప్యూటర్స్ భారతదేశంతో పాటు, అమెరికన్ స్టాక్ ఎక్సేంజ్లోనూ లిస్టయిన ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ వ్యాపార సంస్థ. ఆయన వ్యాపారంలో చేసిన అవకతవకలకు గాను కార్పొరేట్ మోసం కేసులో తప్పిదాన్ని స్వయంగా అంగీకరించి జైలుకు వెళ్లారు. ఈ ఘటన జరిగిన సమయంలో ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్రెడ్డి ఉన్నంత మాత్రాన ఆయనకు దీన్ని అంటగట్టాలని చూడటాన్ని, దీనిని చూపించి జగన్ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నాన్ని ఎవరూ సమర్థించలేరు. ఈ నేపథ్యంలోనే రఘురామరాజు ఉదంతం మరెన్ని మలుపులు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.