రాష్ట్రవ్యాప్తంగా జగనన్న కాలనీల రూపంలో కొత్త మూన్సిపాలిటీలు అవతరిస్తున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా కామెంట్ చేశారు. అనుగుణంగా కార్యాచరణ చేపట్టాల్సిందిగా పురపాలక శాఖ, రెవెన్యూ, గృహ నిర్మాణశాఖలకు జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఇళ్లనిర్మాణ ప్రాజెక్టులపై సీఎం సమీక్ష నిర్వహించారు. గతంలో నిర్వహించిన సమీక్ష మేరకు ల్యాండ్ లెవలింగ్ , ఫిల్లింగ్ , అంతర్గత రోడ్ల నిర్మాణంపై సీఎం ఆరా తీశారు. ఆప్షన్ –3 కింద ఎంపిక చేసుకున్న వారి ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇటుకలు, ఇసుక, సిమెంట్, ఐరన్ లాంటి వనరుల సమీకరణపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ సూచించారు. మరోవైపు త్వరితగతిన కోర్టు కేసు వివాదాల ఇళ్లపట్టాలపై స్పష్టమైన ఉత్తర్వుల కోసం ప్రయత్నించాలని సీఎం జగన్ సూచించారు. ఆగస్టు మొదటి వారంలో ప్రత్యామ్నాయ ప్రణాళికతో సిద్ధంకావాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. జగనన్న కాలనీల్లో డ్రెయిన్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన వేగవంతం చేయాల్సిందిగా సీఎం జగన్ ఆదేశించారు.
ఇళ్లలో పెట్టే ఫ్యాన్లు, బల్బులు, ట్యూబ్లైట్లు నాణ్యతతో ఉండాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. 90 రోజుల్లో పట్టాలు పంపిణీపై కూడా సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. లబ్ధిదారునికి ఇంటి స్థలం ,పట్టా, సంబంధిత డాక్యుమెంట్ల అన్నీ ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. ఈమేరకు లబ్దిదారుల నుంచి ధృవీకరణ తీసుకోవాల్సిందిగా అధికారులకు సీఎం జగన్ సూచనలు చేశారు. జగనన్న కాలనీల్లో సత్వరం పౌరసేవలు అందేలా చర్యలూ తీసుకోవాల్సిందిగా సీఎం జగన్ సూచనలు జారీ చేశారు.