అనంత కోట్ల ప్రజలు జీవించేందుకు గాలి ఎంత ముఖ్యమో తెలిసిందే. ఈ గాలి అనేది రుతువును బట్టో.. సీజన్ను బట్టో సహజంగానే మారుతూ ఉంటుంది. ఇది ఎండా కాలంలో ఒక లాగా. శీతా కాలంలో మరోలా.. వానా కాలంలో ఇంకోలా ఉంటుంది. మన జీవనానికి గాలి ఉంటుంది అయినా ఇది కాలాలను బట్టి శీతల గాలి.. వేసవి గాలి... మంచు గాలి ఇలా అనేక రకాలుగా రూపాంతరం సంతరించు కుంటూ ఉంటుంది. ఇక ఇప్పుడు మన జనసేన అధినేత పవనాలు సారు కూడా తన పవనాన్ని రోజుకో రకంగా మార్చుకుంటున్నారు.
మొన్న 'ఎర్ర' వపనం, నిన్న 'పచ్చ' పవనం, నేడు 'కాషాయ' పవనంగా మారిపోయాడు. రేపు మరేదైనా పవనం అవుతాడా ? లేదా ? అసలే ఎటూ వీయని పవనంగా మిగిలి పోతాడా ? అన్నది కూడా చూడాలి. సినిమాల్లో ఓ స్టార్ హీరోగా ఉన్న పవన్ 2014 ఎన్నికలకు ముందు ఎన్నో ఆశలు, ఆశయాలు, అంచనాలతో జనసేన పార్టీ పెట్టాడు. పవన్ అన్న చిరు ప్రజారాజ్యం పార్టీ పెట్టి వేసిన ప్లాప్ షోకు చాలా మంది రోడ్ల మీదకు వచ్చేశారు. మెగా ప్యామిలీ అభిమానులు ఆ ప్లాప్ షో దెబ్బకు కుదేలు అయిపోయారు.
ఇక తమ్ముడు ఏదో ఉద్దరించేస్తాడని ఎన్నో ఆశలు పెట్టుకున్న వాళ్లకు తొందరగానే మబ్బులు విడిపోయేలా చేశాడు పవనాలు సారు. ఇక 2014 ఎన్నికల్లో పవన్ పోటీ చేయకుండానే అస్త్ర శస్త్రాలు ముందే కింద పడేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ - బీజేపీకి సపోర్ట్ చేసిన పవన్కు కొద్ది రోజులుగా క్లారిటీ వచ్చింది. తాను తప్పు చేశానంటూ ఆ రెండు పార్టీలను చీల్చి చెండాడిన పవన్ ఆ తర్వాత ఆ రెండు పార్టీలకు దూరమయ్యాడు.
గతేడాది ఎన్నికల్లో ఎర్ర పవన్గా మారిపోయి.. కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నాడు. చివరకు రెండు చోట్ల పోటీ చేసినా అసలు ఎమ్మెల్యేగా గెలవలేదు. గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కూడా నువ్వెంత అంటున్నాడు. ఇక ఇప్పుడు ఎన్నికలు ఎప్పుడో నాలుగున్నరేళ్లు ఉన్నా కూడా మళ్లీ వైసీపీని ఢీ కొట్టలేక.. ఆ పార్టీపై పోరాటం చేయలేక ఇప్పుడు కమలంతో నా ప్రయాణం అంటున్నాడు. మరి ఈ ప్రయాణం అసలు ఎన్నికల వరకు అయినా ఉంటుందా ? లేదా మధ్యలో పవనం రూటు మార్చుకుంటుందా ? అన్నది చూడాలి.