వ్యవసాయం ఆధునిక పద్దతిలో చేసేందుకు ఈ తరం యువరైతులు ఇష్టపడుతున్నారు. ఒకప్పుడు నాగళ్లు, కూలీలతో చేసిన పనులను ఇప్పుడు.. ట్రాక్టర్లు, వరినాట్లు వేసే మిషిన్లు, వరి కోత మిషిన్లతో పనులు ఈజీగా, సమయ వేస్తుకాకుండా, చేసుకుంటున్నారు. కొన్నిసార్లు సమయానికి కూలీలు దొరక్క కూడా రైతులు ఇబ్బంది పడేవాళ్లు. తెలంగాణలో మెదక్ జిల్లా ,అల్లాదుర్గంకు చెందిన కొన్యాల సాయిలు, కలుపు తీసే యంత్రాన్ని తయారు చేశాడు.
కూలీలకు డిమాండ్ పెరిగి ఎక్కువ డబ్బులు చెలించాల్సి వస్తుండటంతో రైతులు నష్టపోతున్నారని గ్రహించి.. ఇతడు ఈ యంత్రాన్ని తయారు చేశారు. కొన్ని సాంకేతిక అంశాలను యూ ట్యూబ్ సాయంతో తెలుసుకొని, కలుపు తీసే మిషన్ రూపొందించాడు. దీని తయారికి కావాల్సిన పరికరాలను 20 వేలతో కొనుగోలు చేశాడు. ఈ మిషన్ తయారీకి ఆరు నెలల సమయం పట్టిందంటున్నాడు రైతు సాయిలు.
ఖర్చు తగ్గుతుంది... ఇలాంటి యంత్రాలు కొన్ని ఉన్నప్పటికీ ,సాయిలు తయారు చేసిన ఈ యంత్రం ఎంతో ఉపయోగకరంగా ఉందంటున్నారు మెదక్ జిల్లా రైతులు. పత్తి, జొన్న, మిరప పంటలో కలుపు తీయడానికి కనీసం 10 మంది కూలీలు కావాలి. కానీ ఈ యంత్రంలో ఒక్క లీటర్ డీజిల్ పోస్తే .. ఎకరం పొలం కలుపు తీయొచ్చంటున్నారు. తక్కువ ఖర్చుతో దీన్ని తయారు చేసిన రైతును, ఊరంతా అభినందిస్తున్నారు.