ఎంతో ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీసెస్ పరీక్షలు మొదలవబోతున్నాయి..యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబరు 20 నుంచి 29 వరకు ఐదు రోజులపాటు మెయిన్స్ పరీక్షలను నిర్వహించనుంది. సెప్టెంబరు 20, 21, 22, 28, 29 తేదీల్లో పరీక్షలు జరుగనున్నాయి. సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన 11,845 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలకు హాజరుకానున్నారు.

ఆయా తేదీల్లో రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గం. నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు.ఈ ఏడాది జూన్ 2న దేశవ్యాప్తంగా మొత్తం 72 నగరాల్లో సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షను యూపీఎస్సీ నిర్వహించింది. జులై 12న ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. మెయిన్స్ పరీక్షకు మొత్తం 11,845 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వీరిలో తెలంగాణ నుంచి 673 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. హైదరాబాద్‌లో మూడు కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు.

సివిల్స్ మెయిన్స్‌లో మొత్తం తొమ్మిది పేపర్లు ఉంటాయి. అయితే వీటిలో రెండు లాంగ్వేజ్ (ఇంగ్లిష్, స్థానిక భాష) పేపర్లు కేవలం అర్హత పేపర్లు మాత్రమే.మిగిలిన 7 పేపర్లలో పేపర్-1: జనరల్ ఎస్సేతోపాటు నాలుగు జనరల్‌స్టడీస్ పేపర్లు, ఒక ఆప్షనల్‌కు సంబంధించి రెండు పేపర్లు ఉంటాయి.ఒక్కో పేపర్‌కు 250 మార్కుల చొప్పున మొత్తం ఏడు పేపపర్లకు 1750 మార్కులు ఉంటాయి.

ఈ పేపర్లలో వచ్చిన మార్కుల ఆధారంగానే అభ్యర్థుల ఇంటర్వ్యూ జాబితాను రూపొందిస్తారు.ఇంటర్వ్యూకు 275 మార్కులతో కలిపి మొత్తం 2025 మార్కులకు అభ్యర్థి చూపిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక జాబితాను రూపొందిస్తారు.ఎంతో మంది ఎన్నో రకాలుగా కష్టాలు పడి సిద్దమైపోయి రాయబోతున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: