ఇటీవల కాలంలో ఇంటర్మీడియట్లో మార్కులకు బదులుగా గ్రేడింగ్ విధానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కార్పొరేట్ కాలేజీల ర్యాంకుల మోసానికి చెక్ పెట్టడానికి, కాలేజీల మధ్య పోటీని తగ్గించడానికి నాడు మంత్రి కడియం గ్రేడింగ్ ప్రవేశపెడతామంటూ ప్రకటన చేశారు. అయితే ఇప్పుడు ఏపీలో అమలు చేస్తున్న ఈ గ్రేడింగ్ విధానం రద్దు కానుంది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి రామకృష్ణ ప్రకటించారు. ఈ ఏడాది నుంచి ఇంతకుముందు తరహాలో మార్కులు ఇవ్వనున్నట్లు వెల్లిడించారు.
గ్రేడ్లు ఇచ్చిన కారణంగా ఇతర రాష్ట్రాల్లోని కళాశాలల్లో ప్రవేశాలు, ఎంసెట్కు ఇబ్బందులు తలెత్తిన అంశం పైన ఇంటర్ విద్యామండలి..ప్రభుత్వం ఫోకస్ చేసాయి. ప్రస్తుతం ఇంటర్ తర్వాత జరిగే పలు ఎంట్రన్స్ పరీక్షలలో ఇంటర్ మార్కులకే వెయిటేజీ ఇస్తున్నారు. అయితే ప్రభుత్వం గ్రేడింగ్ విధానానికి పూర్తిగా స్వస్తి పలకాలని భావిస్తోంది. ఇక ఇప్పటి వరకు ఇంటర్ విద్యార్ధులకు అమల్లో ఉన్న గ్రేడింగ్ విధానం వలన తలెత్తుతున్న ఇబ్బందుల కారణంగానే ప్రభుత్వం ఈ కొత్త నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
అలాగే అటు విద్యార్థులు ప్రయోగ పరీక్షల హాల్ టికెట్లను www.bie.ap.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు గ్రేడింగ్ విధానం అమలులోకి రాకముందు మార్కులు ఇచ్చేవారు. సబ్జెక్టుల వారీగా వచ్చిన మొత్తం మార్కులకు ఒక గ్రేడ్ మాత్రమే ఇచ్చేవారు. అయితే ఇంటర్ విద్యా మండలి ప్రస్తుతం ఇంటర్మీడియెట్ లో ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణులు ఇవ్వాలా లేక మార్కులు ఇచ్చి పాస్/ ఫెయిల్ ఇవ్వాలా....? అనే విషయంపై కసరత్తు చేస్తోందని తెలుస్తోంది.