ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను నానా ఇబ్బందులు పెడుతోంది. చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైరస్ అతి తక్కువ సమయంలోనే అన్ని దేశాలు వ్యాపించి ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 16 లక్షలు దాటగా.. మరణాల సంఖ్య లక్షకు చేరువ అవుతున్నాయి. ఇక ఈ కరోనా రక్కసి ఆ రంగం.. ఈ రంగం అని తేడా లేకుండా ప్రతీ రంగంపై ప్రభావం చూపి నష్టాల్లోకి నెట్టేస్తుంది. మరోవైపు పదో తరగతి చదువుతున్న విద్యార్థుల పరీక్షలకు కౌంట్ డౌన్ మొదలయింది అనుకున్నంతలోపే కరోనా వల్ల లాక్డౌన్ వచ్చిపడింది.
దీంతో విద్యార్థులందరూ ఇంటికే పరిమితం అయ్యారు. ఈ క్రమంలోనే విద్యార్థులు ఏం చదవాలో..? ఎవరిని అడగాలో తెలియక నానా ఇబ్బందులు పడుతున్నారు. అయితే అలాంటి వారికి ఓ గుడ్ న్యూస్. ఎందుకంటే.. ఇకపై ఇంట్లోనే ఉండి పాఠాలు నేర్చుకోవచ్చు. తెలంగాణలోని టెన్త్ విద్యార్థులకు డిజిటల్ పాఠాలు ప్రసారం చేయనుంది తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ. దూరదర్శన్ యాదగిరి ఛానెల్లో 10వ తరగతి విద్యార్థులకు డిజిటల్ పాఠాలు ప్రసారం కానున్నాయి. ఏప్రిల్ 12న ఈ క్లాసులు స్టాట్ అవుతాయి.
ఇప్పటికే ఏపీలో టెన్త్ విద్యార్థులకు డిజిటల్ క్లాసులు ప్రారంభమయ్యాయి. అయితే ఇప్పుడు తెలంగాణలో సైతం 10వ తరగతి విద్యార్థులకు శుభ వార్త అందించింది. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు 10వ తరగతి సబ్జెక్ట్లకు సంబంధించిన క్లాసులు ప్రసారమౌతాయి. కాబట్టి.. 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ క్లాసులు చూసి పరీక్షలకు సిద్ధం అవ్వండి.