ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచదేశాల ప్రజలను గడగడలాడిస్తుంది. దీంతో ప్రజలు కరోనా అన్న పేరు వింటేనే భయపడిపోతున్నారు. చైనాలో పుట్టుకొచ్చిన ఈ ప్రాణాంతకర కరోనా వైరస్కు ఎప్పుడు అడ్డుకట్ట పడుతుందా అని ప్రజలందరూ ఎన్నో నెలలుగా ఎదురుచూస్తున్నాయి. అయితే ఓ వైపు కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు పలు దేశాలు లాక్డౌన్ విధించిన వేళ మరోవైపు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయిన వైనమిది. ఎవరికైనా వలేసి మాటలతో బోల్తాకొట్టించి పబ్బం గడుపుకొనే ఏ అవకాశాన్నీ సైబర్ నేరగాళ్లు విడిచిపెట్టరన్నది పచ్చినిజం. ఎక్కడో సుదూర ప్రాంతంలో ఉన్న సైబర్ నేరస్తులు మన నెట్టింట్లో ప్రవేశించి మన బ్యాంకు ఖాతాను ఖాళీ చేసేస్తున్నారు. మన ప్రైవసీని దెబ్బ తీస్తున్నారు.
ముఖ్యంగా అమాయక ప్రజలను మోసం చేస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారు. ఇక తాజాగా సైబర్ నేరగాళ్లు మరోసారి భారత్పై పంజా విసిరారు. ఇండియాకు చెందిన 2.9 కోట్ల మంది వివరాలను డార్క్ వెబ్ లో ఉచితంగా పెట్టేశారు. వీరంతా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారే కావడం గమనార్హం. ఈ మేరకు ఆన్ లైన్ ఇంటెలిజెన్స్ సంస్థ సైబిల్ తెలిపింది. ప్రముఖ జాబ్ వెబ్ సైట్లలో ఉన్న డేటాను వారు దొంగిలించినట్లు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. డీప్ వెబ్ లో ఉద్యోగాలను వెతుక్కుంటున్న 2.9 కోట్ల భారతీయుల వ్యక్తిగత వివరాలను ఉంచినట్లు తెలిపింది.
ఇందులో ఫోన్ నంబర్లు, చిరునామాలు, వారి విద్యార్హత వంటి వివరాలు కూడా ఉన్నట్లు తెలిపింది. అంతేకాదు, సైబిల్ పోస్ట్ చేసిన స్క్రీన్ షాట్ మనదేశంలోని ప్రముఖ జాబ్ పోర్టల్స్ కూడా ఉన్నాయి. అయితే రెజ్యూమేల సేకరణ వద్ద ఈ లీక్ జరిగి ఉండవచ్చని భావిస్తున్నట్లు సైబిల్ తెలిపింది. ఇందులో అత్యంత గోప్యంగా ఉండదగిన ఈ-మెయిల్, ఫోన్ నంబర్, చిరునామా, విద్యార్హత, అనుభవం వంటి వివరాలు ఉన్నాయని సైబిల్ భావిస్తోంది. ఈ సమాచారం ద్వారా సైబర్ నేరగాళ్లు గుర్తింపును చోరీ చేయడం, కుంభకోణాలకు పాల్పడటం వంటి చర్యలు పాల్పడే అవకాశం ఎక్కవగా ఉందని.. జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.