ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న గేట్-2021 పరీక్షలో ఐఐటీ బాంబే కొన్ని మార్పులు చేసింది. కొత్త పేపర్లను చేర్చింది.. అర్హతల్లో మార్పులు చేసింది. ఇంకా ఇలాంటి అనేక ఆసక్తికరమైన మార్పులతో గేట్-2021 ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇంజినీరింగ్, సైన్స్ విద్యార్థులు ప్రముఖ విద్యాసంస్థల్లో ఉన్నత విద్యను అభ్యసించటానికి ప్రధానంగా ఉద్దేశించిన గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్) ఇప్పుడు ఆర్ట్స్, కామర్స్ విద్యార్థులనూ తన పరిధిలోకి తెచ్చుకుంది. గేట్-2021 పరీక్షలు ఆరు రోజులపాటు (2021- ఫిబ్రవరి 5 నుంచి 7 వరకు.. 12 నుంచి 14 వరకు) జరగనున్నాయి. గతంలో ఈ పరీక్ష రెండు విడతలుగా నాలుగు రోజుల పాటు జరిగేది. ప్రస్తుతం కరోనా విపత్తు కారణంగా వ్యక్తిగత దూరం పాటించాల్సిరావటం, మూడో సంవత్సరం విద్యార్థులు కూడా రాయబోతున్నందున.. ఈసారి ఆరు రోజులపాటు నిర్వహిస్తున్నారు.
విద్యార్హత:
గేట్-2021కి సంబంధించి విద్యార్హతలో కూడా మార్పులు జరిగాయి. ఇంజినీరింగ్/టెక్నాలజీ/ఆర్కిటెక్చర్/సైన్స్/కామర్స్/ఆర్ట్స్ విభాగాల్లో మూడు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు చదివినవారు ఈ పరీక్ష రాయటానికి అర్హులు. అంటే ప్రస్తుతం ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా ఈ పరీక్ష రాయవచ్చు. దీంతో మరింత ఎక్కువ మంది పరీక్ష రాసే అవకాశం లభించినట్లయ్యింది.