పేరుకు అది రైల్వే ఫ్లాట్ ఫారం కానీ ఆయా సమయాలలో చూస్తే ఏదో కోచింగ్ సెంటర్ కు దారితప్పి వెళ్ళినట్టే ఉంటుంది. పొద్దు పొడవటానికంటే ముందే వందల మంది విద్యార్థులు అక్కడకు చేరుకుంటారు, మళ్ళీ పొద్దు గూకగానే ఇదే పరిస్థితి అక్కడ. కారణం పేదరికం బాగా పేరుకుపోయిన ప్రాంతం రోహతాస్ జిల్లా. ఇప్పటికి అక్కడ చాలా ఊళ్లకు కనీస సమయం వరకు కూడా విద్యుత్ సరఫరా లేదు. అందుకే సూర్యుడి వెలుగు తగ్గగానే చదువుకునే వాళ్ళందరూ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. అలాగే ఉదయం కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఆ విద్యార్థులు ఉన్న ప్రాంతాలలో కనీస విద్యుత్ సౌకర్యాలు లేనందున ఆ స్టేషన్ లైట్స్ కింద కూర్చుని చదువుకొని వెళ్తున్నారు.
సాయంత్రం అయితే చాలు ఆ ఒక్క స్టేషన్ తప్ప అన్ని గ్రామాలు చీకటిలో మగ్గి పోవలసిందే. అందుకే అక్కడి విద్యార్థులు ఈ స్టేషన్ లైట్స్ కిందకు చేరుకుంటారు. ఈ స్టేషన్ లో మాత్రం 24 గంటల విద్యుత్ సదుపాయం ఉంది. దీనితో చుట్టుపక్కల చదువుకునే వాళ్ళు అంతా ఈ స్టేషన్ కు వచ్చి చదువుకుంటారు. ఇలా ఈ విద్యార్థులంతా కూడా 2002 నుండి అక్కడే అదేవిధంగా విద్యను కొనసాగిస్తున్నారు. ఇటీవల ఛత్తీస్ ఘడ్ కేడర్ కు చెందిన ఒక ఐఏఎస్ దీనిని చూసి సామజిక మాధ్యమాలలో పంచుకోవడంతో ఇది వెలుగులోకి వచ్చింది. ఇప్పటికైనా పరిస్థితి మారిందో లేదో తెలియాల్సి ఉంది.ఏమైనా ఆ విద్యార్థుల దీక్ష ప్రశంసనీయం. వారైనా తమ ఊళ్లకు విద్యుత్ సదుపాయం తెచ్చుకోగలరని ఆశిద్దాం!