కరోనా కారణంగా లాక్డౌన్ విధించాయి ఆయా దేశ ప్రభుత్వాలు. దీంతో ఇంటికే పరిమితమయిన చిన్నారులు ఆన్లైన్ తరగతులకు హాజరయ్యారు. ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను ఫోన్లో చూస్తూ వినెవాళ్లు. ఇదంతా మనకు మామూలుగానే అనిపిస్తోంది. కానీ చిన్నారుల జీవన శైలిలో వచ్చిన ఈ మార్పులు సమస్యలకు మూలం అవుతున్నాయి. కరోనా ప్రారంభం అయినప్పటి నుంచి పిల్లల్లో హ్రస్వ దృష్టి తీవ్రంగా పెరిగిపోయింది అని చెప్పవచ్చు.
హాంకాంగ్లోని చైనీస్ యూనివర్సిటీ పరిశోధకులు 709 మంది పిల్లలపై అధ్యయనం చేశారు. 2015లో వెయ్యి మంది పిల్లలపై చేసిన ఇదే తరహా అధ్యయనంతో తాజా ఫలితాలను పోల్చి చూస్తే హ్రస్వ దృష్టి పెరిగిపోయిందని తెలిసింది. కరోనా సమయంలో హ్రస్వదృష్టి కేసుల సంఖ్య గణనీయంగా పెరిగాయని పరిశోధనకు నేతృత్వం వహించిన అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జేసన్ యామ్ వెల్లడించారు. జీవనశైలిలోనూ అనేక మార్పులు గమనించినట్లు తెలిపారు ఆయన. బయటకు వెళ్లడం బాగా తగ్గి, ఎలక్ట్రానిక్ పరికరాల స్క్రీన్ను చూడటం పెరిడం ద్వారా హ్రస్వదృష్టి సమస్య రెట్టింపు అయ్యేందుకు కారణమయ్యాయని తెలిపారు.