కొన్ని పండ్లు కొన్ని సీజన్స్ లలో మాత్రమే దొరుకుతాయి. కొన్ని పండ్లు సంవత్సరానికి ఒక్కసారే దొరుకుతాయి. అయితే అరటి పండ్లు మాత్రం ప్రతి సీజన్లోనూ దొరుకుతాయి. అలాగే ప్రతి ఒక్కరికీ ఎక్కువగా అందుబాటులో ఉండేది అరటి పండు. అయితే చాలా మంది అరటి పండును తినడానికి ఇష్టపడతారు. కానీ మధుమేహులు మాత్రం అరటి పండుపై ఇష్టం ఉన్నా.. తినడానికి భయపడతారు. వాస్తవానికి మధుమేహులకు ఇది తినొద్దు అది తాగొద్దు అనే నియంత్రణలు ఉక్కిరిబిక్కిరి చేసేస్తాయి.
ఈ క్రమంలోనే ముఖ్యంగా అరటి, ద్రాక్ష పండ్ల విషయంలో అనేక అపోహలు ప్రచారంలో ఉన్నాయి. కానీ అరటిపండు తింటూ కూడా రక్తంలోని చక్కెరను నియంత్రణలో ఉంచుకోవచ్చని ఆహార నిపుణులు అంటారు. నిజానికి దీనిలో అత్యధికంగా ఉండే పొటాషియం బీపీ, అధిక ఒత్తిడిని తగ్గిస్తుంది. అరటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. రక్తపోటు తగిన మోతాదులో ఉండేలా చేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
పొటాషియం అధికంగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల పక్షవాతం ముప్పు తక్కువగా ఉంటున్నట్టు పలు అధ్యయనాల్లో గుర్తించారు. అరటిపండులో పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. అయితే మధుమేహులు ఒక మాదిరిగా పండిన అరటి పండును తినడం వల్ల ఎక్కువ పీచు పదార్థాలు.. తక్కువ చిక్కెత శాతం పొందవచ్చు. దీంతో మధుమేహులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే జీర్ణసంబంధమైన సమస్యలకు అరటిపండు మంచి ఔషధంలా పనిచేస్తుంది.