ప్రతిష్టాత్మాక ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఈఎన్‌టీ సహా నగరంలోని అన్ని ప్రధాన ఆస్పత్రులతో పాటు ప్రభుత్వ ఆస్పత్రులు  అర్హత, అనుభవాన్ని పక్కనబెట్టి పైరవీకారులకు, జూనియర్లకు పెద్దపీట వేయడంతో   కొంత మంది వైద్యుల మధ్య కోల్డ్‌వార్‌ నడుస్తోంది.  పరిపాలన పరమైన అంశాల్లో సహకరించక పోవడం, అసమర్థతపై ప్రశ్నించడం, ఆరోపణలు, ఫిర్యాదలు చేయడం వరకు వెళుతుండడతో పరోక్షంగా ఆస్పత్రుల పరువు పోతోంది. వైద్యుల మధ్య తలెత్తుతున్న వివాదాలు ఇన్‌పేషంట్‌ సేవలతో పాటు సర్జరీలు కూడా తగ్గడానికి కారణమవుతోందని సీనియర్‌ వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. 


నిలోఫర్‌ ఆస్పత్రిలో శిశువులకు మెరుగైన వైద్యం అందించేందుకు అత్యాధునిక రాజీవ్‌ ఇంటెన్సీవ్‌ కేర్‌ యూనిట్‌ను మూడేళ్ల క్రితం ప్రారంభించారు. పడకల సంఖ్యను 1000కి పెంచారు.  2016లో 11,305 సర్జరీలు చేస్తే..2018లో 2,668 సర్జరీలకు పడిపోయింది. తాజాగా ఇద్దరి వైద్యుల మధ్య నెలకొన్న గొడవలు ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకునేదాకా వెళ్లింది. ఈ అంతర్గత విబేధాలకు తోడు ఆరోగ్యశ్రీ ఇంటెన్సివ్‌స్‌ తక్కువగా ఉండటంతో చాలా మంది వైద్యులు చికిత్సలు చేసేందుకు ఆసక్తిచూపడం లేదు.కొత్త భవనంతో పాటు అత్యాధునిక వైద్య పరికరాలు ఇక్కడే ఉన్న గాంధీ ఆస్పత్రి  పడకల సామర్థ్యం  1012.


 గతంతో పోలిస్తే ప్రస్తుతం ఓపీ ఘణనీయంగా పెరిగింది. అనస్థీషియన్ల కొరతకు తోడు వైద్యుల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాల వల్ల తరచూ సర్జరీలు నిలిచిపోతున్నాయి. 2016లో 59,868 సర్జరీలు చేయగా, 2018లో 50,502 సర్జరీలు మాత్రమే చేశారు.ఇక సుమారు 125 పడకల సామర్థ్యం గల చెవి, ముక్కు, గొంతు(ఈఎన్‌టీ) ఆస్పత్రి ఓపీకి రోజుకు సగటున 1500 మంది రోగులు వస్తుంటారు. 2015లో 46,950 సర్జరీలు జరిగితే.. 2018లో 37,033 చికిత్సలకు పడిపోయాయు. ప్రపంచంలోనే తొలిసారిగా క్లోరోఫామ్‌ను మత్తుమందుగా ఉపయోగించి రోగులకు చికిత్స చేసిన ఘనతతో పాటు 1982లో దేశంలోనే తొలి కిడ్నీ మార్పిడి చికిత్స చేసిన ఘనత ఉస్మానియా ఆస్పత్రి వైద్యుల సొంతం. ఒకప్పుడు దేశంలోనే ఎంతో మంచి గుర్తింపు సంపాధించకున్న ఆస్పత్రిలో ప్రస్తుతం సాధారణ చికిత్సలూ కరువయ్యాయి. 


సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ, ప్లాస్టిక్‌ సర్జరీ విభాగం వైద్యులు ఏడాది క్రితం వరకు అనేక అరుదైన చికిత్సలు చేసి అందరి మన్నలను పొందారు. ఈ గుర్తింపును జీర్ణించుకోలేని కొంత మంది అధికారులు వారికి సహాయపడక పోగా, వివిధ అంశాలపై ఆరోపణలు గుప్పించడంతో మనస్థాపం చెందిన వైద్యులు చికిత్సలకు దూరంగా ఉంటున్నట్లు తెలిసింది. విభాగాధిపతులే మెడికోలను రెచ్చగొట్టడం.. పీజీలతో సహాయ నిరాకరణ చేయంచడం.. మహిళా ప్రొఫెసర్లను కించరిచడం వంటి సంఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. ఇక నిపుణులు లేకపోవడంతో కిడ్నీ మార్పిడి చికిత్సలు కూడా దాదాపుగా నిలిచిపోయాయి. ఈ సంఘటనలు ఉన్నదాధికారుల దృష్టికి వెళ్లినా పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాలు చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: