ఆరోగ్యంగా ఉండేందుకు శరీరానికి సరైన ఆహారం చాలా ముఖ్యం. సృష్టిలోని అన్ని సంపదలకన్నా ఆరోగ్యంగా జీవించడమే అసలైన సంపద. ఆర్ధికంగా ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా ఆరోగ్యం ఉన్నతంగా లేనప్పుడు ఆ సంపద ఉన్నా లేనట్లే. ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముందుగా తెలుసుకోవాలి. ఏవి తింటే ఆరోగ్యానికి మంచిది..? ఏవి తింటే ఆరోగ్యానికి మంచిది కాదు..? అన్న విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకుంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది.
దీంతో రక్త నాళాలు గట్టిగా మారుతాయి. ఫలితంగా హైబీపీ వస్తుంది. కనుక కొవ్వు పదార్థాలను కాకుండా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలను తీసుకోవాలి. పాలు ఆరోగ్యానికి మంచివే. కానీ కొవ్వు తీయని పాలను తాగితే వాటిలో ఉండే కొవ్వు మన శరీరంలో చేరి రక్తనాళాల్లో పేరుకుపోతుంది. నాళాలు దృఢంగా మారుతాయి. రక్త సరఫరాకు ఆటంకం ఏర్పడి ఫలితంగా గుండె జబ్బులు వస్తాయి. రోజుకొక యాపిల్ తింటే వైద్యునికి దూరంగా ఉండొచ్చు అంటాము. కానీ రోజుకు ఒక తులసి ఆకు తింటే కొన్ని రకాల క్యాన్సర్లకు దూరంగా ఉండొచ్చు.
అలాగే నిల్వ ఉంచే ఊరగాయ పచ్చళ్లలో ఉప్పు ఎక్కువగా వేస్తారన్న విషయం తెలిసిందే. అయితే అలాంటి పచ్చళ్లను బాగా తింటే శరీరంలో సోడియం నిల్వలు పెరిగి హైబీపీ వస్తుంది. ఎప్పుడో ఒకసారి మద్యం సేవిస్తే ఫర్వాలేదు. కానీ రోజూ మద్యం సేవించే అలవాటు ఉన్నవారిలో గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ. అలాగే చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలను తినకూడదు. ఇవి స్థూలకాయం, డయాబెటిస్లను కలగజేస్తాయి.