మన పెద్దలు రోజుకు నాలుగు నుంచి ఐదుసార్లు భోజనం చేసేవారు. అది క్రమేపీ మూడుకు.. తరువాత రెండుసార్లుకు.. ఇప్పడు కేవలం ఒకసారికి మాత్రమే చేరింది. గతంలో శారీరక శ్రమ ఎక్కువుగా ఉండేది. దీంతో జీర్ణవ్యవస్థ వేగంగా పనిచేసి, ఎక్కువసార్లు ఆకలి వేసేది. కానీ మారుతున్న యాంత్రిక జీవనంలో శారీరక శ్రమ కంటే మానసిక శ్రమ ఎక్కువగా ఉండటంతో ప్రధానంగా జీర్ణ సమస్యలు ఎక్కువుగా వస్తున్నాయి. దీంతో డైటింగ్స్ అంటూ నోరు కట్టేసుకొని నానా రకాలుగా తిప్పలు పడుతున్నారు.
ఈ క్రమంలోనే నోరూరించేలా వంటకాలు కళ్ల ముందు ఉండి.. కడుపు నిండా లాగించేయాలని మనసులో ఉన్నా ఎక్కడ కొవ్వు పెరిగి ఊబకాయం వస్తుందన్న భయం తీవ్రంగా వెంటాడుతుంటుంది. ఇక కొందరు మనసు చంపుకోలేక వాటిని లాగించేసి తర్వాత బాధపడుతుంటారు. అయితే భోజనం తక్కువ తినాలి అని అనుకుంటే ఓ సింపుల్ అండ్ స్మాల్ ట్రిక్ ఫాలో అయితే సరిపోతుంది. అదేంటంటే.. కంటి ముందు కనిపిస్తున్న ఆహార పదార్థాలను 2నిమిషాల పాటు వాసన చూస్తే, ఆపై ఆటోమేటిక్ గా తక్కువగా తింటారట. ఎక్కువ తినాలి అనుకున్న తక్కువే తింటారు అంట.
యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా రీసెర్చర్లు ఓ అధ్యయనం నిర్వహించి, ఈ విషయాన్ని కనుగొనగా, 'మార్కెటింగ్ రిసెర్చ్' అనే జర్నల్ దీన్ని ప్రచురించింది. రెండు నిమిషాలు వాసన చూస్తే ఎంతో సంతృప్తి కలుగుతుందని ఈ అధ్యయనం పేర్కొంది. ఆ తర్వాత ఆహారం ఏది అయినా, తక్కువగానే తీసుకుంటామని, క్యాలరీలు పెరుగుతాయన్న భయం ఉండదని చెప్పింది.ఆహారం వాసన వల్ల సంతృప్తి లభించడమే దీనికి కారణమని వివరించింది.