ద్రుష్టి లోపం ఉన్నవారికి వారి చూపును మెరుగు పరుచుకోవాలంటే.. సహజంగానే ఎవరైనా విటమిన్ 'ఎ' ఉన్న ఆహారాలను అధికంగా తీసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. అయితే దాంతో పాటు త్రాటక అనే ఓ యోగా ప్రక్రియ కూడా మనకు అందుబాటులో ఉంది. నిజానికి ఇది ఒక వ్యాయామం. దీంతో మన కంటి చూపు మెరుగుపడుతుంది. అయితే దీన్ని ఎలా చేయాలో, దాంతో మనకు ఇంకా ఏమేం ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.


మొదటిది.. అరచేతి సైజులో ఉండే ఒక ఆకుని తీసుకుని అందులో నల్లని వృత్తాన్ని గీయాలి. అనంతరం ఆ ఆకును గోడకు అతికించాలి. దాని ఎదురుగా 2 అడుగుల దూరంలో కూర్చుని అదే ఆకును 5 నుంచి 10 నిమిషాల పాటు తీక్షణంగా చూడాలి. ఈ వ్యాయామాన్ని ఉదయం, సాయంత్రం చేయాలి. అయితే ఆకును చూసే సమయంలో కళ్లను ఆర్పకూడదు. తెరిచే ఉంచాలి.


రెండవది.. చీకటి గదిలో ఒక క్యాండిల్‌ను వెలిగించి దానివైపే కన్నార్పకుండా 5 నుంచి 10 నిమిషాల పాటు చూడాలి. ఈ వ్యాయామాన్ని కూడా నిత్యం ఉదయం, సాయంత్రం చేయాలి.


మూడవది.. కళ్లు తెరిచి చూసినా ఏమీ కనిపించని చీకటి గదిలో 5 నుంచి 10 నిమిషాల పాటు ఉండాలి. కళ్లు తెరిచే చీకటిని గమనించాలి. కన్నార్పకూడదు. ఈ వ్యాయామాన్ని నిత్యం ఒక్కసారి చేస్తే చాలు. 


నాలుగవది... పచ్చని ప్రకృతిలో కూర్చుని నీలంగా ఉన్న ఆకాశం వైపు కన్నార్పకుండా 5 నుంచి 10 నిమిషాల పాటు చూడాలి. ఈ వ్యాయామాన్ని నిత్యం ఒక్కసారి చేయాలి.


ఐదవది.. మీకు నచ్చిన వ్యక్తులు లేదా మీకిష్టమైన దేవుడు/ దేవత ఫొటోగానీ, ఏదైనా ఒక క్రిస్టల్, పెద్దదైన పువ్వు లేదా సూదిలోకి దారం ఎక్కించే మొనను గానీ తదేకంగా 5 నుంచి 10 నిమిషాల పాటు నిత్యం చూడాలి. ఆ వస్తువుకు, మీకు మధ్య 2 అడుగుల దూరం ఉండేలా చూసుకోవాలి. వాటిని చూసేటప్పుడు కన్నార్పకూడదు. ఈ వ్యాయామాన్ని కూడా నిత్యం ఒక్కసారి చేస్తే చాలు. ఇలా మీరు నిత్యం చేసినట్లయితే... కంటి చూపుతో పాటు ఏకాగ్రత కూడా అలవడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: