చాలా మంది పిల్లలు యాక్టివ్గా లేకుండా డల్గా మూడీగా ఉంటుంటారు. ఎవ్వరితోనూ మాట్లాడకుండా ఎవరైనా పిలిచినా సరే సరిగా పట్టించుకోకుండా ఉంటారు. ఇలా యాక్టివ్గా ఉండకపోవడం వలన చదువులో కూడా వెనకబడి ఉంటారు. ఇవన్నీ ఆటిజానికి సంబంధించిన లక్షణాలని వైదులు చెబుతున్నారు. అలాగే పిల్లల్లో నాడీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వలన కూడా ఈ సమస్య ఎక్కువగా తలెత్తుతుంది. దీని బారిన పడినవారిలో మానసికంగా కూడా ఎదుగుదల కాస్త తక్కువగా ఉంటుంది. ఇది ఎక్కువగా మగ పిల్లల్లోనే కనిపిస్తుంది. ఇది పుట్టుకతో వచ్చే సమస్య. దీనిని రెండు మూడేళ్ల వయసు వచ్చేదాకా గుర్తించడం కాస్త కష్టమే అవుతుంది.
ఆటిజం బారినపడినవారు నలుగురితో కలవడానికి కాస్త సంకోచితంగా ఉంటారు. నేరుగా ఎవరితోనూ కలిసుండరు. భావోద్వేగాలను వ్యక్తం చేయలేరు. ఒకే మాటను పదే పదే చెబుతుండడం, ఒకే రకమైన ఆహారం, దుస్తులు కావాలనడం, చేతులు, కాళ్లు విచిత్రంగా కదపడం వంటి లక్షణాలూ కనిపిస్తుంటాయి. ఆడి, పాడే వయసులో పిల్లలు ముభావంగా, అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారంటే వారిలో కచ్చితంగా ఆటిజం ఉండవచ్చు. ఈ లక్షణాలను తల్లిదండ్రులు ఎంత త్వరగా కనిపెడితే అంత మంచిది. దానికి తగిన చికిత్సను అందించగలరు.
‘‘పిల్లలు బయటకు వెళ్లడం, స్కూలుకు వెళ్లడం వంటివి మొదలుపెట్టినప్పుడు వారు మిగతా వారితో కలసి ఉండాల్సి వస్తుంది. కమ్యూనికేట్ కావాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలోనే ఆటిజం లక్షణాలున్న పిల్లల్లోని స్వభావం ఇలాంటి సమయంలోనే బయటపడుతుంది..’’ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే వినికిడి సమస్యలున్న పిల్లలకు కూడా మాటలు సరిగా రావు. అందువల్ల ఆటిజంగా నిర్ధారించే ముందు ఇతర సమస్యలేమైనా ఉన్నాయేమో పరిశీలించడం ఎంతో అవసరం.
ఆటిజం అనేది సాధారణంగా జన్యు సంబంధిత లోపాల వల్ల ఏర్పడే వ్యాధి. మెదడు ఎదుగుదలకు తోడ్పడే కొన్ని జన్యువులు, క్రోమోజోముల్లో లోపం వల్ల ఈ వ్యాధి వస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే తల్లి గర్భిణిగా ఉన్నప్పుడు రుబెల్లా, సైటోమెగాలో వైరస్ ఇన్ఫెక్షన్లు వచ్చినా. థైరాయిడ్, మధుమేహం వంటి సమస్యలున్న వారి పిల్లలకు బుద్ధి మాంద్యం వచ్చే అవకాశం ఉందని వైధ్యులు అంటున్నారు.