అతడు కరోనాను జయించాడు. ఆ మహమ్మారి బారి నుంచి బయటపడ్డాడు. ఆస్పత్రి నుంచి సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి వెళ్లాడు. ఇది నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ప్రపంచాన్ని గడగడవణకిస్తున్న కరోనా వైరస్ మాట వినిపిస్తే చాలు జంన అమ్మబాబోయ్ అంటున్నారు. ఇప్పటికే ఎంతోమందిని పొట్టునబెట్టుకున్న ఈ వైరస్ బారిన ఇంకా వేలాదిమంది పడుతున్నారు. ప్రస్తుతానికి మందులేదుగానీ.. అందుబాటులో ఉన్న అత్యాధునికి వైద్యసేవలతో కరోనాను కట్టడి చేసేందుకు వైద్యులు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ వైద్యులు గుడ్ న్యూస్ చెప్పారు. హైదరాబాద్ గాంధీ ఆస్పత్రి నుంచి కరోనా వైరస్ సోకిన ఓ వ్యక్తిని వైద్యులు డిశ్చార్జ్ చేశారు. మహేంద్రహిల్స్కు చెందిన వ్యక్తికి తాజాగా నిర్వహించిన పరీక్షలో కరోనా నెగెటివ్ వచ్చింది. అంతేగాకుండా.. ఆయన పూర్తిగా కోలుకోవడంతో ఇంటికి పంపించారు. 14 రోజులు హోమ్ ఐసోలేషన్ వార్డులో ఉండాలని వైద్యులు సూచించారు.
నిజానికి.. మార్చి ఒకటో తేదీన అతడికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఇక అప్పటి నుంచి 15 రోజుల పాటు అతనికి గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందించారు. కంటికిరెప్పలా కాపాడారు. అయితే.. కరోనా బాధితుడు పూర్తిగా కోలుకోవడంతో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆనందం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ సోకిన వ్యక్తిని సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి పంపించడం హర్షణీయమని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో ఒక్క వ్యక్తికి కూడా కరోనా పాజిటివ్ లేదని మంత్రి స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, శుక్రవారం సాయంత్రం దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఇద్దరు వ్యక్తులకు కరోనా లక్షణాలు ఉండటంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఏది ఏమైనా.. గాంధీ ఆస్పత్రిలో కరోనా బాధితుడికి చికిత్స అందించి, సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి పంపించడంతో వైద్యసేవలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.