ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ భారత్లోనూ క్రమంగా విస్తరిస్తోంది. ఎక్కడో చైనాలో పుట్టిన ఈ మహమ్మారి సరిహద్దులు దాటుకుని దేశంలోకి ప్రవేశించింది. ఇప్పటి వరుకు ఈ వైరస్ కు మందు లేకపోవడంతో దీని వ్యాప్తిని తలుచుకుని ప్రపంచ దేశాలన్నీ గడగడలాడుతున్నాయి.
కాగా కరోనా మన దేశంలో పుట్టింది కాదని.. ఇక్కడి వాతావరణ పరిస్థితులు వైరస్కు అంత అనుకూలం కాదని చెబుతున్నారు. అయినప్పటికీ దాని వ్యాప్తిని అడ్డుకునేందుకు ఆయా రాష్ట్రాలు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాయి.
అయితే మరణాలు , వైరస్ వల్ల భయాందోళనల అంశాన్ని కాసేపు పక్కన పెడితే కరోనా వైరస్ వల్ల మనకు మంచే జరిగిందని సనాతనవాదులు పేర్కొంటున్నారు. కరోనా వైరస్ పుణ్యమాని భారతీయ సంస్కృతీ, సంప్రదాయాలను ప్రపంచం అంతా గౌరవిస్తున్నారని అంటున్నారు. ఇప్పుడు విదేశీయులు సైతం భారతదేశ ఆచార వ్యవహారాలను, ఆహారపు అలవాట్లను పాటిస్తున్నారని ఉదహరిస్తున్నారు. ప్రపంచమంతా ఇప్పుడు ‘నమస్తే భారత్’ అంటోందని చెబుతున్నారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాల్ని గౌరవిస్తూ, షేక్ హ్యాండ్ వద్దు, నమస్తే చెప్పాలంటూ చాలా దేశాల్లో ఇప్పటికే ‘కరోనా ఎఫెక్ట్ కారణంగా’ ఆ దేశాలు జారీ అయ్యాయి.
ఇదొక్కటే కాదు, మన ఆహారపు అలవాట్లనీ ప్రపంచ దేశాలు ఫాలో అవుతున్నాయట. మన ఇంట్లో వేడి గంజి నుంచి, మిరియాల చారు వరకూ.. ఇలా ప్రతీదీ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అవుతోందంటే అతిశయోక్తి కాదేమో. ‘మీకు తెలుసా, మీ వంటింట్లోనే మీ ఇమ్యూనిటీని పెంచే దినుసులు చాలా వున్నాయ్..’ అంటూ సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా పోస్ట్లు కన్పిస్తున్నాయి. వైద్యులూ వీటిని సర్టిఫై చేస్తున్నారు.
‘భారతీయుల ఆహారపుటలవాట్లు చాలా ప్రత్యేకమైనవి.. చాలా ఆరోగ్యకరమైనవి..’ అని ప్రపంచ స్థాయి వైద్యులు తేల్చి చెబుతున్నారు. ‘మంచి ఆహారపు అలవాట్లు చాలా ముఖ్యం.. భారతీయ ఆహారపు అలవాట్లకు వున్న ప్రత్యేకతే మనల్ని ఆరోగ్యకరంగా వుంచుతుంది.. అలాగని, ఆ ఆహారపుటలవాట్లతో కరోనాని పూర్తిగా ఇక్కడ నివారించలేం..’ అన్నది కొందరి వైద్యుల వాదన.
ఇమ్యూనిటీ సరిగ్గా వుంటే, కరోనా వచ్చినా నష్టమేమీ లేదని వైద్యులు చెబుతున్నాక.. మన ఆహారపు అలవాట్లను విదేశీయులు పాటించకుండా వుంటారా.? అదే జరుగుతోందిప్పుడు. హగ్గు వద్దు.. నమస్తే ముద్దు.. అన్నప్పుడే మనం గెలిచేశాం. కానీ, మన సంస్కృతీ సంప్రదాయాల్ని మళ్ళీ మనం ‘గేలి’ చేసుకునే పరిస్థితి రాకూడదు. మన ఘనత ప్రపంచానికి తెలిసిందంటే.. ఈ కోణంలో కరోనా మన దేశానికి మంచే చేసిందని ఒప్పుకుంటారా.?