కరోనా వైరస్ భారతదేశంలో ఉధృతమవుతోందని, దేశ ప్రజానీకమంతా ఐక్యతతో, సంకల్ప బలంతో, పూర్తి క్రమశిక్షణతో ఎదుర్కోవాలని ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆయన జాతిని ఉద్దేశించి ఢిల్లీలో మీడియా ముఖంగా మాట్లాడారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ఆయన కొన్ని కీలక ఆదేశాలతో పాటు సూచనలు చేశారు. ప్రజలు జనతా కర్ఫ్యూను పాటించాలని అన్నారు. సమూహలకు దూరంగా ఉండాలని తెలిపారు. ఇక మరీ ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు మరికొన్ని వారాల పాటు బయటకి ఎట్టి పరిస్థితుల్లో వెళ్లకూడాదని అన్నారు. ఇక తప్పని సరి అవసరముంటే తప్పా ఎవరూ కూడా ప్రయాణాలకు దూరంగా ఉండటం ఎంతో శ్రేయస్కరమని అన్నారు.
ఈ నెల 22న ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూను పాటించాలని పిలుపునిచ్చారు. ప్రజల కోసం ప్రజలు చేసే ఈ ఉద్యమంలో ప్రతీ ఒక్కరూ పాల్గొనాలని కోరారు. మనం ఆరోగ్యంగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా ఉంటుందని గుర్తు చేశారు. దేశంలో రోజు రోజురోజుకూ విస్తరిస్తున్న కరోనా వ్యాధిని ఇక తేలిగ్గా తీసుకోలేమని అన్నారు. ప్రపంచ దేశాలన్నీ కూడా కరోనాతో యుద్ధం చేస్తున్నాయని, మొదటి, రెండో ప్రపంచ దేశాలప్పుడు కూడా ఈ స్థాయిలో మానావాళి అతలాకుతలం కాలేదని పేర్కొన్నారు. వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులంతా కూడా ఇంటి వద్ద నుంచే పనిచేయాలని, ఇందుకు యాజమాన్యాలు సహకరించాలని అన్నారు. జీతాలు ఇవ్వకపోవడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని అన్నారు.
అయితే కొన్ని రంగాల వారు తప్పనిసరి పరిస్థితుల్లో పని చేయాల్సి ఉంటుందని వారు తగు జాగ్రత్తలు పాటించాలని అన్నారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి వైద్యులు, నర్సులు మనకు సేవ చేస్తున్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకుందాం. వైరస్ను దేశ ప్రజలంతా తమ సంకల్ప బలంతో ఎదుర్కొవాల్సి ఉంది. ఇప్పుడు మనలో పట్టుదల, సామాజిక భద్రత, బాధ్యత ఎంతో అవసరమని పిలుపునిచ్చారు. కరోనా బాధితులందరికీ మెరుగైన వైద్యం అందిస్తున్నామని, బాధితులందరిని కూడా ఐసోలేషన్ వార్డులకు తరలిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు అంచనా వేస్తు తగు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుందని అన్నారు. దేశంలో నిత్యవసర వస్తువులకు కొరత లేకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.