వివాదాస్పద ప్రజాప్రతినిధిగా పేరుగాంచిన సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కరోనా వివాదంలో ట్రోల్ అవుతున్నారు. కరోనా కట్టడికి అటు కేంద్రం, ఇటు రాష్ట్రం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుండగా అమెరికా వెళ్లి వచ్చి క్వారంటైన్లో ఉండాల్సిన ప్రజాప్రతినిధి దర్జాగా జనంలో తిరుగుతుండటంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఎమ్మెల్యేకు కరోనా రూల్స్ వర్తించవా అంటూ జనం సోషల్ మీడియాలో తిట్టిపోస్తుండటం గమనార్హం. ఈ నెల 16న కోనప్ప దంపతులు అమెరికా నుంచి వచ్చారు. అయితే క్వారంటైన్లో ఉండకుండా మరుసటి రోజే మున్సిపల్ సమావేశంలో పాల్గొనడం విమర్శలకు తావిస్తోంది.
బంధువులు, సన్నిహితుల ఇళ్లలో జరిగిన సత్యనారాయణస్వామి వ్రతం, వివాహాలకు హాజరయ్యారు. అయితే శంషాబాద్ ఎయిర్పోర్టులో కోనప్ప దంపతులకు అన్ని పరీక్షలు చేశారు. ఆరోగ్యంగా ఉన్నందున క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదనేది కోనప్ప వాదనగా తెలుస్తోంది. వాస్తవానికి కరోనా వ్యాప్తి కారణంగా ఎవరైనా ఎంతటి గొప్పోరైనా 14 రోజులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ లోగానీ సొంతంగా ఇంట్లో ఒంటరిగా పరి శుభ్రంగాగానీ తమను తాము క్వారంటైన్ చేసుకోవాలని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే అయితే ఎమ్మెల్యే కోనప్ప అవేవీ పాటించకుండా జనంలో తిరగడంపై విమర్శలు వస్తున్నాయి.
ఈ సారు మూతికి కరోనా అంటదు. అలాగే కళ్లూ చెవులు ఏవైనా సరే కరోనా అంటుకోదు. ఆయన ఎవరికి అంటించారో తెలవదు. అది తెలవాలంటే 14 రోజులు ఆగాలి. ఎమ్మెల్యే దంపతులు అమెరికా పర్యటనకు వెళ్లి మంగళవారం హైదరాబాద్ విమనాశ్రయాంలో దిగారు. విమానం దిగి నేరుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వచ్చి అక్కడి నుంచి సిర్పూర్ చేరుకోవడం గమనార్హం. మంగళవారంనాడు వచ్చిన ఆయన బుధవారం నాడు కాగజ్ నగర్ మునిసిపల్ బడ్జెట్ సమావేశంలో పాల్గొన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులకు కరచాలనం అందజేస్తూ మాట్లాడటం విశేషం. కరోనా కట్టుబాటు తప్పిన ఎమ్మెల్యేపై ప్రజాప్రతినిధులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో ఫారెస్ట్ ఆఫీసర్పై దాడికి పాల్పడి ఎమ్మెల్యే కోనప్ప వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.