కరోనా కరళా నృత్యం చేస్తూ భూమండలాన్ని చుట్టేస్తోంది. మానవజాతి శక్తి సామర్థ్యాలను..వైజ్ఞాన్ని ప్రశ్నిస్తూ, సవాల్ చేస్తూ శరవేగంగా విస్తరిస్తోంది. ఐదు దశాబ్దాల క్రితమే పుట్టి ఇన్నాళ్లు విశ్రాంతి తీసుకుని కూడగట్టుకుని వచ్చిన అపరా శక్తితో మానవాళిపై విరుచుకుపడుతోంది. పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేస్తే తగ్గిపోతుంది, బ్లీచింగ్ పౌడర్ చల్లితే చనిపోతుందని.. కరోనా దౌడ్ తీస్తుందని పాలకులు వ్యాఖ్యనించినప్పుడు బహుశా అది విని నవ్వుకుని ఉంటుంది. పారాసిటమాల్ కాదు..దాని జేజమ్మను ప్రయోగించిన నేను ఇక్కడే ఉంటా, బాడీలను మారుస్తా..బతికే ఉంటానంటూ వికట్టంటాహాసం చేస్తోంది.
ప్రపంచ దేశాల్లో కరోనా వ్యాప్తి చెందుతూ పరిస్థితి రోజురోజుకు దిగజారుతున్న మాటైతే వాస్తవం. ఇదీ అందరూ అంగీకరించాల్సిన నిజం. ఇటలీలో మరణాలు వేల సంఖ్యలోకి చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆ దేశంలో నెలకొన్న పరిస్థితులను బట్టి అర్థమవుతోంది. చైనా ప్రస్తుతం కోలుకుంటుందని భావిస్తున్న విదేశాల నుంచి స్వస్థలాలకు చేరుకుంటున్న వారిలో పాజిటివ్ కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తున్న అంశమే. దీన్ని బట్టి కరోనాను పారదోలడం అంత ఈజీ కాదన్నది నిష్టుర సత్యం. కరోనా ప్రమాదానికి అనేక దేశాలు అంచున ఉన్నాయి. ఇంకో అడుగు కరోనా ముందుకు వస్తే మానవాళికి మరిన్ని జఠిలమైన పరిస్థితులు తప్పవని మేధావులు విశ్లేషిస్తున్నారు.
కరోనాను ఎదుర్కొవడానికి ఇప్పటికీ ప్రపంచ దేశాలు ఏకతాటికిపైకి రాకపోవడం గమనార్హం. కరోనా స్వైరవిహారం చేస్తుంటే..దేశాలు మాత్రం సరిహద్దుల్లో గీసుకుని నివారణ చర్యలు చేపట్టడం దేనికి సంకేతం. ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఇక్కడి డంప్ అవుతున్న వైరస్ను ఎలా కట్టడి చేస్తారన్న ప్రశ్నకు ప్రభుత్వాల నుంచి సరైన సమాధానం లేదనే చెప్పాలి. కరోనా అధికంగా ప్రబలితే ఆర్థికాభివృద్ధి సాధించని చిన్న దేశాల పరిస్థితి ఏమిటన్నది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కరోనా ఎదుర్కొవడానికి ప్రపంచం మొత్తం ముందుకు కదలాల్సిందే. లేదంటే మానవాళి మనుగడకే ప్రమాదం వాటిల్లే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.